నల్లగొండ, ఫిబ్రవరి 8 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచీ బీజేపీకీ ఇష్టం లేదనే విషయం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రుజువైందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం సరికాదని హితవు చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్రం విద్వేషపూరిత వివక్షను చూపిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీ, ప్రధాని మోదీకి ఎంత అక్కసు ఉన్నదో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాబట్టే విభజన హామీలు అమలు చేయటం లేదని పేర్కొన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే తెలంగాణ బీజేపీ నేతలు ఇక ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారని ప్రశ్నించారు. మోదీ తన వ్యాఖ్యలతో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మాస్వరాజ్తోపాటు బీజేపీ అధిష్ఠానాన్ని అవమానించారని పేర్కొన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
ప్రధాని మోదీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం. దేశ చరిత్రలో ఇంత ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, కల సాకారం కోసం ఎందరో జీవితాలు త్యాగం చేశారు. నాడు పార్లమెంటులో అప్పటి బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ మద్దతు ఇచ్చారు. వారిని సైతం అవమాన పరిచేలా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దీనిని ఖండిస్తున్నాం.
– ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్