హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వందేభారత్లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం పరేడ్ మైదానానికి చేరుకున్న ప్రధాని ఎంఎంటీఎస్కు సంబంధించిన 13 అదనపు లోకల్ రైలు సర్వీసులను వర్చువల్గా ప్రారంభించారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు, పలు జాతీయ రహదారుల పనులకు, బీబీనగర్ ఎయిమ్స్ దవాఖాన భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ మహబూబ్నగర్ మధ్య డబ్లింగ్ లైను, విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేశారు.
చప్పగా సాగిన ప్రధాని పర్యటన
రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన చప్పగా సాగింది. శనివారం ఉదయం 11.30కి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ అక్కడి నుంచే డిజిటల్ పద్ధతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో అనిల్కుమార్ లాహోటీ, సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ పాల్గొన్నారు.
నేటి నుంచి వందేభారత్ సేవలు
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. శుక్రవారం నుంచే అడ్వాన్స్ టికెట్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి.