Minister Jagadish Reddy | రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆ ప్రంసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణాలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా.. బీజేపీ పాలనలో అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీని ప్రతిఘటిస్తున్నందుకే బీఆర్ఎస్తో సహా విపక్షాలపై సీబీఐ, ఈడీ, ఐటీ తదితర కేంద్ర సంస్థలను ఎగదోస్తున్నారని ఆరోపించారు. దారికి వచ్చి కాషాయ గూటికి చేరితే మాఫీ.. లేదంటే అక్రమ కేసులతో సతాయించడం ఢిల్లీ పెద్దలకు పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని.. అందులో భాగమే ఇవాళ్టి పర్యటనలో తెలంగాణాపై ప్రధాని విద్వేషపు ప్రసంగమంటూ మంత్రి మండిపడ్డారు.