8.2.2022 – సిగ్గులేని రీతిలో విభజన: మోదీ
“చాలా అవమానకర రీతిలో ఆంధ్రప్రదేశ్ను విభజించారు. మైకులు బంద్చేశారు. పెప్పర్ స్ప్రే చల్లారు. ఎలాంటి చర్చ జరుగలేదు. ఈ విధానం మంచిగా అనిపిస్తున్నదా? ఇదేమైనా ప్రజాస్వామ్యం అనిపించుకొంటుందా? మేమేమీ తెలంగాణ విరోధులం కాదు. ఏపీ విభజనను కూడా అందరూ కలిసి కూర్చొని చేసి ఉండొచ్చు. మీరు (కాంగ్రెస్) చేసిన ఈ చర్యవల్ల ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మీరు నాటిన చేదు బీజాలు అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్కు హాని చేస్తున్నాయి.” –మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ
మనిషి ఏం చెప్తాడన్నది కాదు, మనసులో ఏముందన్నది ముఖ్యం. ఈ దేశ పార్లమెంటు ఎందరివో అసలు రంగులు బయటపెట్టిన సత్యపీఠం. ఈసారి ప్రధాని మోదీ వంతు! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మోదీ, మరోసారి తెలంగాణపై విషం చిమ్మారు. మంగళవారం రాజ్యసభలో మోదీ మాట్లాడారు. తెలంగాణ విరోధిని కానంటూనే, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఏపీ విభజన సిగ్గులేని రీతిలో జరిగిందంటూ పరోక్షంగా తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానించారు. అమరుల బలిదానాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచారు. పదేపదే అదే పగ, అదే దగా!
1948 అయిష్టతను కలుపుకొంటే.. తెలంగాణ డిమాండ్కు 66 ఏండ్లు. 1969 ఉద్యమం నుంచి లెక్కేస్తే.. తెలంగాణ డిమాండ్కు 45 ఏండ్లు. తెలంగాణ చర్చ వయస్సు 45-66 ఏండ్లు. అనేక దశాబ్దాల ఆకాంక్షలు, రెండు భారీ ఉద్యమాలు, వందల మంది ఆత్మత్యాగాలు, మరెందరో బలిదానాలు చేసిన ఫలితం.. ఏపీవిభజన. తెలంగాణ ఏర్పాటు! అలాంటి రాష్ట్ర విభజనను అవమానకరం అని ప్రకటించడంద్వారా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను మరోసారి అవమానించారు. పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా ఆమోదించిన బిల్లుల్ని తప్పుబట్టడం ద్వారా బీజేపీ మోదీ తెలంగాణనే కాదు, చట్టసభల ఔన్నత్యాన్ని కించపరిచారు.
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లయింది. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో పురోగమిస్తున్నది. తెలంగాణకు చేయాల్సిన సహకారం చేయకపోగా, సందర్భం లేకుండా ప్రధాని మోదీ పదే పదే తెలంగాణ ఏర్పాటు తీరును ప్రశ్నిస్తూ పుండుమీద కారం చల్లినట్టుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటుపై లోక్సభ, రాజ్యసభలో జరిగిన చర్చ ఏపీ, తెలంగాణ నేతలు చేసిన డిమాండ్లు పార్లమెంటు రికార్డుల్లో ఉన్నాయి. అయినా ఎలాంటి చర్చ జరగలేదంటూ ప్రధాని మోదీ పదే పదే తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై ఆది నుంచీ బీజేపీకి ఉన్న వ్యతిరేకతకు ప్రధాని మోదీ మాటలు తాజా సాక్ష్యంగా నిలిచాయి.
ఇంతకీ మోదీ మనసులో మాటేంటి? ఏపీకి అన్యాయం జరిగిందనా? తెలంగాణ ఎందుకు ఇచ్చారనా? విభజన జరిగిన తీరే రెండు రాష్ర్టాల మధ్య సమస్యలకు కారణమైతే మరి ఎనిమిదేండ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? హర్యానా ఏర్పడి 56 ఏండ్లు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఏర్పడి 22 ఏండ్లు. మరి మీరు ప్రశాంతంగా ఏర్పాటు చేసిన మూడు రాష్ర్టాల్లో… 22 ఏండ్ల తర్వాత కూడా విభజన సమస్యలు ఎందుకున్నాయి మోదీగారూ!!
ఈ చరిత్ర తెలుసా మోదీ?
అది 1969. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం. సికింద్రాబాద్లోని మార్కెట్ వీధి. నాలుగేండ్ల చిన్నారి శివకుమార్ను ఎత్తుకొని తల్లి సావిత్రి తన ఇంటిముందు అరుగుమీద నిలబడి ఉన్నది. పోలీసులు ఆ తల్లీ బిడ్డలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఒళ్లు జల్లెడై నాలుగేండ్ల చిన్నారి, ఆ తల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భార్యా బిడ్డల్ని పోగొట్టుకున్న భర్త శంకరయ్య పిచ్చివాడైపోయాడు!
అది 2009. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్ను అరెస్టు చేశారు. దీనికి నిరసనగా నవంబరు 29న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి అగ్నిజ్వాలలకు ఆహుతైపోయాడు. ప్రకటించిన రాష్ర్టాన్ని అడ్డుకున్న పాపానికి, ఆ తర్వాతి ఐదేండ్లకాలంలో శ్రీకాంత్లాగే చాలామంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ద్వేషం మరోసారి బయటపడింది. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని అంటూనే.. రాష్ట్ర ఏర్పాటు అప్రజాస్వామికంగా జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరు సరైంది కాదంటూ వ్యాఖ్యానించారు. మైకులు బంద్చేసి, పెప్పర్స్ప్రే చల్లి, ఎలాంటి చర్చలు లేకుండా రాష్ర్టాన్ని అవమానకరంగా విభజించారని కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూమిక పోషించింది. అక్కడ వారిని ఏం చేశారు? ఇక్కడ కుర్చీలో కూర్చునేందుకు (అధికారంలోకి వచ్చేందుకు) అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారు? చాలా అవమానకర రీతిలో ఆంధ్రప్రదేశ్ను విభజించారు. మైకులు బంద్చేశారు. మిర్చి స్ప్రే (పెప్పర్ స్ప్రే) చల్లారు. ఎలాంటి చర్చ జరుగలేదు. ఈ విధానం మంచిగా అనిపిస్తున్నదా? ఇదేమైనా ప్రజాస్వామ్యం అనిపించుకొంటుందా? అటల్జీ ప్రభుత్వంలో కూడా మూడు రాష్ర్టాలను ఏర్పాటు చేశారు. రాష్ర్టాలను ఏర్పాటుచేయడానికి మేమేమీ వ్యతిరేకం కాదు. కానీ ఇచ్చిన విధానం ఎలా ఉన్నది? అటల్జీ సర్కారు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మూడు రాష్ర్టాలను ఏర్పాటుచేసింది. కానీ అప్పుడు తుఫాన్ ఏమీ రాలేదు. అన్ని నిర్ణయాలు శాంతియుతంగా తీసుకొన్నారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో కూడా ఇలాగే జరిగి ఉండాల్సింది. మేమేమీ తెలంగాణ విరోధులం కాదు. ఏపీ విభజనను కూడా అందరూ కలిసి కూర్చొని చేసి ఉండొచ్చు. కానీ మీ అహంకారం, అధికార దాహం దేశానికి వెగటు కలిగించింది. మీరు చేసిన ఈ చర్యవల్ల ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మీరు నాటిన చేదు బీజాలు అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్కు హాని చేస్తున్నాయి. మీకు కూడా రాజకీయంగా ఎలాంటి లాభం జరుగలేదు. అలాంటిది మీరు మాకు సలహాలు చెప్తున్నారు.’