(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి కిసాన్ (పీఎం కిసాన్) పథకం ద్వారా 2022-23 ఏప్రిల్-జూలై విడతలో 11.3 కోట్ల మంది రైతులు లబ్ధిపొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం ఆమె పార్లమెంట్లో 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతూ.. పీఎం కిసాన్ అమలుకు గత మూడేండ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్లో రైతుల సంఖ్య 18 కోట్లకు పైమాటే. వీరిలో 62% శాతం మందికే పీఎం కిసాన్ ఫలాలు అందుతున్నట్టు నిర్మలమ్మ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అంతేనా, 11.3 కోట్ల మంది రైతులకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడమంటే గత మూడేండ్ల వ్యవధిలో ఒక్కో రైతుకు సగటున రూ.17,699 మాత్రమే వెచ్చించినట్టు లెక్క. ఇదే సమయంలో తెలంగాణ ప్రభు త్వం రైతుబంధు ద్వారా ఒక్కో రైతుపై సగటున రూ.99,213 ఖర్చుచేసింది. రాష్ట్రంలోని మొత్తం 66 లక్షల మంది రైతులకు రూ.65,481 కోట్లు అందజేసింది. ఇది పీఎం కిసాన్ కింద కేంద్రం చేసిన ఖర్చు కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ. రైతుబంధు పథకం స్ఫూర్తితోనే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే.