డోర్నకల్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర, వైరా, డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. డోర్నకల్ సభలో మాట్లాడుతూ.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. తమ తండాల్లో తమ రాజ్యం కావాలని గిరిజనులు ఎన్నో ఏండ్లు కొట్లాడిండ్రని, కానీ కాంగ్రెస్ నాయకులు వాళ్ల కొట్లాటను లెక్క చేయలేదని సీఎం విమర్శించారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి రెడ్యా నాయక్ మళ్లీ గెలిపిస్తే ఈసారి ఆయన హోదా పెరుగుతదని, నియోజకవర్గానికి లాభం జరుగుతదని సీఎం చెప్పారు.
‘డోర్నకల్ నియోజకవర్గంలో గిరిజన సోదరులున్నరు. లంబాడీలు, ఆదివాసీలు, కోయలు, గోండులు ఉన్నరు. ‘మా తండాల్లో మా రాజ్యం ఉండాలె’ అని వాళ్లు అనేక ఏండ్లు కొట్లాడిండ్రు. కానీ కాంగ్రెసోళ్లు లెక్కజేసిండ్రా..? ఎవడన్నా పట్టించుకున్నడా..? ఇయ్యాల బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక 3,500 తండాలను, గోండు గూడేలను గ్రామ పంచాయతీలు చేసినం. ఒక్క రెడ్యా నాయక్ గారి డోర్నకల్ నియోకవర్గంలోనే 82 తండాలు గ్రామ పంచాయతీలు అయినయ్. వాళ్లను వాళ్లే పాలించుకుంటున్నరు. తండాలు మంచిగయితున్నయ్’ అన్నారు.
‘రెడ్యా నాయక్ నాతోటి కొట్లాడి ప్రతి తండాకు బీటీ రోడ్ వేయించుకున్నడు. తండాల్లోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు అయినయ్. రెడ్యా నాయక్ సీనియర్ నాయకుడు, మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి, నాకు చాలా సలహాలు ఇచ్చే వ్యక్తి, నియోజకవర్గ క్షేమాన్నే కోరుతడు. నా మాట విని రెడ్యా నాయక్ను మళ్లీ గెలిపించండి. ఈసారి ఆయన హోదా పెరుగుతది. మీకు మంచి లాభం జరుగుతది. ఆయనను గెలిపిస్తే మీ నియోజకవర్గంలో పనులన్నీ చేయించే బాధ్యత నాది అని నేను హామీ ఇస్తున్నా. ఇంత భారీ సంఖ్యలో సభకు వచ్చిన మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నాకో విషయం అర్థమైంది. ఇయ్యాల్నే రెడ్యా నాయక్ గెలిచిపోయినట్లు స్పష్టమైంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.