Vinod Kumar | దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేయడం గొప్ప విషయమని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (IERP) పాత్ర అమోఘమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో మంగళవారం జరిగిన ఐఈఆర్పీల రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుద్ధి మాంద్యం, మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు, కళ్లు కనిపించని, చెవులు పినిపించని పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్న ఐఈఆర్పీల సేవలు సమాజంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తాయన్నారు.
ఈ విషయంలో ఎంతో ఓపికతో విద్యా బోధన చేస్తున్న ఐఈఆర్పీల ఉద్యోగ సర్వీస్ను క్రమబద్ధీకరణ చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం నిరంతరం తపించే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ నాటి, నేటి పరిస్థితులను వినోద్ కుమార్ సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నాయకులు చెన్న కేశవ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇన్నా రెడ్డి, ఐఈఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు సిల్వెరి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.