ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇద్దరు కలిసి కావాలనే తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో రాజ్యాంగ బద్దమైన ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీ తన బాధ్యతలను మర్చిపోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరీంనగర్లో వినోద్ కుమార్ శుక్రవారం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య బద్దంగా, పార్లమెంటరీ విధానంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై మోడీ ఆది నుంచి విషం చిమ్ముతూనే ఉన్నారని అన్నారు.
2004లో టీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎంపీలు ఉన్నపుడే 32 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టిన విషయాన్ని వినోద్కుమార్ గుర్తు చేశారు. 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదంతో ఎన్నికల్లోకి వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన విస్మరించిందని, ఆనాడు చంద్రబాబు నాయకుడు రాజకీయంగా ఒత్తిడి తేవడంతో ప్రధాన డిమాండ్గా ఉన్న తెలంగాణకు అన్యాయం చేసి ఎలాంటి డిమాండ్ లేని మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమం జరిగినపుడు గుజరాత్కు సీఎంగా ఉన్న మోడీకి ఇక్కడ జరిగిన ఉద్యమం గురించి ఏం తెలుసని వినోద్కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మోడీ పార్లమెంట్లో తన ప్రసంగంలో తల్లిని చంపి, బిడ్డను బతికించారని ఏపీ విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రకు అనుకూలంగా వ్యవహరించారని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, 500 మెగావాట్ల సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాకు కట్టబెట్టారని, ఈ సమయంలో పార్లమెంట్లో తామెంత మొత్తుకున్నా వినిపించుకోలేదని వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోడీ ఇపుడు తెలంగాణను అభివృద్ధి చేస్తానని చెప్పడం సిగ్గు చేటుగా ఉందన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించే ముందు తన పార్టీలో ఎంత మంది వారసత్వంగా రాజకీయాల్లో వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారో చూసుకోవాలని అన్నారు.
కరీంనగర్ను మరో భైంసా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని వినోద్కుమార్ ధ్వజమెత్తారు. మైనార్టీ, మెజార్టీ పేరుతో ప్రజల్ని చీల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నదని అన్నారు. ఏ మైనార్టీ వర్గాలైనా దేశంలో పుట్టిన వాళ్లేనని, వాళ్లది మన రక్తమేనని వినోద్కుమార్ స్పష్టం చేశారు. చరిత్రలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా హిందు మతం నుంచి ఇతర మతాలను స్వీకరించారని అన్నారు. మతం అనేది వ్యక్తిగతమని, దీనిని బజారులో పెట్టవద్దని హితువు పలికారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందువులు ఉన్నారని, అక్కడ పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించుకుంటున్నారని, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వందలాది హిందు దేవాలయాలు ఉన్నాయని, ఇక్కడ మత విద్వేశాలను రెచ్చగొడితే ఆయా దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితిని కూడా బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. హిందు అనేది మతం కాదని, అది ఒక మార్గమని, అలాంటి మార్గంలో మనందరం నడవాలని అన్నారు. హిందు పేరుతో మతాన్ని రెచ్చగొట్టడం, వేరే మతాల గురించి అనుచితంగా మాట్లాడటం మంచిది కాదని వినోద్ కుమార్ హితవు పలికారు.