హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజడ్) రానున్నాయి. వరద కాలువలను కేంద్రంగా చేసుకుని వీటిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మత్స్యశాఖ, మత్స్య ఫెడరేషన్ నిర్ణయించాయి. ఇందుకోసం తొలి దశలో శ్రీరాంసాగర్-మిడ్ మానేరు వరద కాలువను ఎంపిక చేశాయి. వాస్తవానికి ఈ కాలువ నాలుగు జోన్లలో 122 కి.మీ. పొడవు ఉంటుంది. ఇందులో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ నుంచి సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెళ్లి గ్రామం వరకు 20 కిలోమీటర్ల ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు.
రాష్ట్ర మత్స్యకారుల ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ నేతృత్వంలోని అధికారుల బృందం ఇటీవల శ్రీరాంసాగర్ వరద కాలువను పరిశీలిచింది. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఈ కాలువ చేపల పెంపకానికి ఎంతో అనుకూలమని తేల్చింది. ఈ ప్రాజెక్టుతో నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో సుమారు 12 వేల మంది మత్స్యకారులకు ఉపాధి లభించడంతోపాటు రూ.300 కోట్ల విలువైన మత్స్య సంపదను సృష్టించేందుకు అవకాశం ఉంటుందని అంచనా. ఇది విజయవంతమైన తర్వాత ఎస్ఎఫ్డీజడ్ను కాకతీయ కెనాల్కు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. మిడ్ మానేరును ఫిషరీష్ హబ్గా మార్చేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే చర్యలు చేపట్టడంతో అమెరికా సంస్థ ‘ఫిష్ఇన్’ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీనితోపాటు ఇక్కడ కేజ్ కల్చర్ను ప్రారంభించేందుకు కూడా కసరత్తు జరుగుతున్నది. వీటికి తోడుగా ఎస్ఎఫ్డీజడ్లను ఏర్పాటు చేస్తే రాష్ట్ర మత్స్యరంగం మరింత అభివృద్ధి చెందుతుంది.
శ్రీరాంసాగర్ కాలువలో చేపల పెంపకాన్ని చేపట్టడం ద్వారా వరద కాలువలో చేపల పెంపకాన్ని చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నది. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేయలేదు. కోల్కతాలోని సెంట్రల్ ఇన్ల్యాండ్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఫ్రి) గతంలో ఒరిస్సా సుందరబన్ ప్రాంతంలోని వరద కాలువలో చేపల పెంపకంపై నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. అనంతరం ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ సంస్థ పలు రాష్ర్టాలకు సూచించినా ఏ రాష్ట్రమూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మత్స్య పరిశోధకుడిగా పేరున్న రాష్ట్ర మత్స్యకారుల ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ స్వీయ ఆసక్తితో సిఫ్రి ప్రయోగంపై స్టడీ చేశారు. ఇది తెలంగాణకు ఎంతో అనుకూలమని తేలడంతో రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
చేపల పెంపకానికి శ్రీరాంసాగర్ కాలువ ఎంతో అనుకూలంగా ఉన్నది. ఇలాంటి ప్రాంతాలను ఎంపిక చేసి ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా మత్స్యకారులకు ఉపాధితోపాటు ఆదాయాన్ని పెంచేందుకు వీలవుతుంది. అందుకే సిఫ్రి ప్రయోగాన్ని ఇక్కడ అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. 22 కి.మీ. పరిధిలో పైలట్ ప్రాజెక్టును చేపట్టబోతున్నాం. – పిట్టల రవీందర్, రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్