హైదరాబాద్, ఆగస్టు13 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదక్షత, పకడ్బందీ ప్రణాళికల ఫలితంగా తెలంగాణలో అసమానతలకు తావులేకుండా పోయిందని, ప్రశాంత వాతావరణం, రాజకీయ సుస్థిరతకు చిరునామాగా నిలుస్తున్నదని, అందువల్లే రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ముస్లిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసీసీఐ) హైదరాబాద్లో శనివారం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్కు మంత్రి కొప్పుల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఆలోచనలు, దూరదృష్టి, పకా ప్రణాళికలు, వారు ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం అమలుతో రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయని వివరించారు. తెలంగాణలో అన్ని మత విశ్వాసాలకు సముచిత గౌరవముందని, సెక్యులర్ రాష్ట్రంగా వర్ధిల్లుతున్నదని తెలిపారు. ముస్లిం సమాజాన్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకుగాను ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, 204 గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఫార్మా రంగంలో ఎదురే లేదని, ఐటీలో బెంగళూరును మించి దూసుకుపోతున్నామని, దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. పరిశ్రమలు నెలకొల్పాలనుకునే ముస్లింలను తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని మంత్రి ఈ సందర్భంగా హామీనిచ్చారు.