యాచారం, జూన్ 24: ఫార్మాసిటీ భూముల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఫార్మా సిటీ కోసం తాము ఇవ్వని భూముల్లోకి వస్తేది సహించేది లేదని రైతులు హెచ్చరించారు. ఇప్పటికే ఫార్మాకు అప్పగించిన భూముల విషయంలో చేసుకొన్న అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా తమ భూముల్లోకి వస్తే జేసీబీల మీద పెట్రోలు పోసి తగులబెడుతామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రైతు కున్రెడ్డి మాధవరెడ్డి తనకున్న సుమారు రెండు ఎకరాల పొలాన్ని గతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఇవ్వలేదు.
ఈ భూముల్లోకి అధికారులు బుధవారం ప్రవేశించి జేసీబీలతో చదును చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. పరిహారం తీసుకోని భూమిని గుంతలమయంగా ఎలా చేస్తారని, వెంటనే గుంతలు పూడ్చి చదునుచేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా పొలాల్లోకి వచ్చి చదును చేయడం ఎంతవరకు సమంజసమని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
గతంలో ఫార్మాకు రెండు ఎకరాల పొలాన్ని ఇచ్చామని వాటికి సంబంధించి ఎకరాకు 121 గజాల చొప్పున ఇస్తామన్న ఫార్మాసిటీ ప్లాట్ల డాక్యుమెంట్లను ఇప్పటికీ ఇవ్వడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్లాట్లలో నకిలీ ప్లాట్లు ఉన్నాయని, వాటిని గుర్తించి అర్హులకు ప్లాట్ల డాక్యుమెంట్లు ఇస్తామని ఆర్ఐ మురళీకృష్ట తెలిపారు. ముందు పట్టా భూములకు సంబంధించిన ప్లాట్లు ఇచ్చి, తరువాత అసైన్డ్ భూములకు సంబంధించిన ప్లాట్లను అందులో నిజమైన రైతులకు ఇవ్వాలని అధికారులకు సూచించారు.
విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన రైతు సిద్దగోని జగన్ తన పొలాన్ని దున్నడంతో అధికారులు దానిని పరిశీలించారు. ఫార్మాసిటీకి ఇచ్చిన భూములను సాగు చేయొద్దని చెప్పినా ఎందుకు దున్నుతున్నావని రైతును ప్రశ్నించారు. తనకు ఎకరాకు 121 గజాల ప్లాటు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వలేదని, ప్లాట్ల పత్రాలు ఇచ్చే వరకు తన భూమిలోకి ఎవరూ రావొద్దని, అప్పటివరకు తన భూమిని సాగు చేస్తానని రైతు అధికారులకు తేల్చి చెప్పాడు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు కనమోని గణేశ్, కొండల్రెడ్డి, సందీప్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.