హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రైతుల వద్ద ధాన్యాన్ని కొనడం అంటే ఒక సాహసమని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయశాఖపై సమీక్షలో భాగంగా ధాన్యంసేకరణపై సీఎం మాట్లాడుతూ.. ‘ఇవన్నీ అల్లాటప్ప మాటలు కావు. పిచ్చికూతలతోని అయ్యే పనులు కావు. ఇందుకు ఎంతో ధైర్యం కావాలె. కరోనా సమయంలో లారీలు, హమాలీలు, డ్రైవర్లు, అన్నింటికీ కొరతే.. వాటన్నింటినీ అధిగమిస్తూ, ఇప్పటికే 87% ధాన్యాన్ని సేకరించినం. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణ సేకరణచేస్తాం. ఎఫ్సీఐతో మాట్లాడి ఎంత ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభుత్వం కొంటుంది. రైతులు భయాందోళనలకు గురికావద్దు. తెలంగాణ రాష్ట్రం తప్ప దేశంలో ఎకడా రైతువద్ద నుంచి ఒక గింజ కూడా కొంటలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలుచేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నరు. విజ్ఞత కలిగిన రైతులు వారి ఆటలు సాగనిస్తలేరు. తిట్టి ఎల్లగొడుతున్నరు. గతేడాది కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే తెలంగాణ జీఎస్డీపీకి సాగురంగం 17% ఆదాయాన్ని అందజేసింది. పరోక్షంగా రాష్ట్ర ఆదాయానికి వ్యవసాయం ఆదెరువుగా మారే పరిస్థితికి చేరుకొన్నది’ అని సీఎం తెలిపారు. ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో, దానిని నిల్వచేయడం కూడా అంతే శ్రమతో కూడుకొన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేయడానికి మాత్రమే గోదాముల లభ్యత ఉండేది. కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకొనేందుకు గోదాములు నిర్మించుకొన్నం. భవిష్యత్తులో 40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్సీఐ.. తెలంగాణలో సేకరించక పోవడం విచారకరం. పంజాబ్లో ఒక పంట మాత్రమే వరి పంట పండిస్తున్నారు. తెలంగాణలో రెండు సీజన్లలో పండిస్తున్నారు. తెలంగా ణలో రెండు పంటలకు కలిపి 1.3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ను తలదన్ని దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ లెక్కలే ఈ విషయాన్ని చెప్తున్నాయి. కేంద్రం పంజాబ్లో పండుతున్న ధాన్యాన్ని నూటికి నూరుశాతం సేకరి స్తున్నది. తెలంగాణలో ఎందుకు సేకరించదు. ఇది వివక్ష కాదా? పంజాబ్కు దీటుగా ధాన్యాన్ని దేశానికి అందిస్తున్న తెలంగాణ విషయంలో వివక్ష చూపడం ఎంతమాత్రం సరికాదు. రాష్ర్టానికోవిధమైన నీతిని పాటించడం సమాఖ్య స్ఫూర్తి కాదు. ఈ విషయంలో మొత్తం ధాన్యాన్ని సేకరించాల్సిందిగా ప్రధానమంత్రికి లేఖ రాయనున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.