హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ భూకబ్జాదారులకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి చెందిన శంషాబాద్లోని 50 ఎకరాలను కబ్జా చేసి తప్పుడు పత్రాలతో తెలంగాణ హైకోర్టులో భంగపడిన పిటిషనర్కు సోమవారం అత్యున్నత న్యాయస్థానంలోనూ ఎదురుదెబ్బే తగిలింది. భూఆక్రమణదారులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హెచ్ఎండీఏకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎం దానకిశోర్ పర్యవేక్షణలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు సోమవారం సుప్రీంకోర్టుకు హాజరై శంషాబాద్ భూముల వివరాలను అందజేశారు. పిటిషనర్ తరపున అడ్వకేట్ ముకుల్ రోహిత్ వాదించగా.. హెచ్ఎండీఏ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూద్ర, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ డేవీన సక్సేనా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సతీశ్చంద్రతో కూడిన డివిజనల్ బెంచ్ పిటిషనర్ ఎస్ఎల్ఎల్పీ పిటిషన్ను డిస్మిస్ చేశారు. కాగా, శంషాబాద్లో రూ.1,000 కోట్ల విలువైన 50 ఎకరాల హెచ్ఎండీఏ భూముల కబ్జాకు ఉమ్మడి రాష్ట్రంలో కొందరు ప్రయత్నించారు. బోగస్ కోర్టు ఉత్తర్వులతో కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు పన్నిన కుట్రను గత కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవడంతోపాటు హైకోర్టులో పక్కా ఆధారాలతో వాదించించింది. నిరుడు డిసెంబర్ 14న హైకోర్టు శంషాబాద్లోని 50 ఎకరాల భూములు హెచ్ఎండీఏవే తుది తీర్పును వెలువరించింది.