హైదరాబాద్ : భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం ప్రగతి భవన్లో జరిగింది. ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో మంత్రివర్గం పలు అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంది. లాక్డౌన్ పొడిగింపు నేపధ్యంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి ప్రభుత్వ పనిదినాల్లో స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ్ పేట్, మక్తల్, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీతో పాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని, సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్యశాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలంది. సంబంధిత నియంత్రిణ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానల పరిస్థితుల మీద రివ్యూ చేయాలని , అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను మంత్రివర్గం ఆదేశించింది.