ఎస్సారెస్పీ ఆయకట్టుకు శాశ్వత భరోసా కల్పించింది. వరదకాలువ రాతనే మార్చింది. ఎల్లంపల్లికి సార్థకత చేకూర్చింది. గొలుసుకట్టు చెరువులకు ఆయువుపట్టయ్యింది. జలసంపదకు నెలవైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం.. తెలంగాణ జీవధార! అయినప్పటికీ కాంగ్రెస్ ఆదినుంచీ ఆ ప్రాజెక్టుపై పనిగట్టుకొని విమర్శలకు దిగుతున్నది. అదేపనిగా కరెంటు చార్జీలు, ఎత్తిపోతలు ఇలా ఏదో సాకుచూపుతూ విఫల ప్రాజెక్టుగా చూపేందుకు యత్నిస్తున్నది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు ప్రతిష్ఠను మసకబార్చేందుకు పూనుకున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మాణం జరిగిన ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు శ్రీరాంసాగర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అంటూ ఉమ్మడిపాలకులు ఊదరగొట్టినా ఆచరణలో మాత్రం దుఃఖదాయినిగా మిగిలిపోయిందనేది చేదు వాస్తవం. శ్రీరాంసాగర్ పరిస్థితి చూసుక మురువ.. చెప్పుక ఏడువ అన్నట్టుగా తయారైంది. 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించి, 196 టీఎంసీలను వినియోగించుకొనేలా రూపకల్పన చేస్తే ప్రాజెక్టును ప్రారంభించేనాటికే ప్రధాన జలాశయం సామర్థ్యం 12 టీఎంసీలు తగ్గింది. కాలువలన్నీ పూర్తయ్యేసరికి మరో 10 టీఎంసీల సామర్థ్యం తగ్గింది. ఇక ఎస్సారెస్పీ స్టేజ్ 1లో అంటే ఎల్ఎండీకి ఎగువన అంటే ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0-146 కిలోమీటర్ల వరకు 4,62,920 ఎకరాలు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146-284 కిలోమీటర్ల వరకు 5,05,720 ఎకరాలు మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. అందులో 1/3 తరి, 2/3 మెట్టపంటలకు నీరిందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. కానీ ఉమ్మడి పాలనలో ఏనాడు కూడా స్జేజ్ 1లో మొత్తం ఆయకట్టులో రెండొంతుల ఆయకట్టుకు నీరందించిన దాఖలాల్లేవు. ప్రాజెక్టు చరిత్రలో వానకాలం, యాసంగి కలిపినా మొత్తంగా 9 లక్షలు దాటలేదంటే ప్రాజెక్టు దుస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో దిద్దుబాటుకు ఏవైనా చర్యలు చేపట్టారా? అంటే అదీ లేదు. పైగా మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు ఉన్న ఆయకట్టుకే దిక్కులేని ఎస్సారెస్పీని ఆధారంగా చేసుకొని మరిన్ని ప్రాజెక్టులు చేపట్టారు. ఎస్సారెస్పీ మొదటి దశ ఆయకట్టుకే దిక్కు లేదంటే 1984లో ఎస్సారెస్పీ రెండో దశకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. కాకతీయ కాలువను 284 కిలోమీటర్ల నుంచి 347 కిలోమీటరుకు విస్తరణ చేపట్టారు. ఆ తర్వాత అది మూసీలో కలుస్తుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండు పర్యాయయాలు 1996, 2002లో శంకుస్థాపన చేశారు. అయినా రాష్ట్ర ఏర్పాటు నాటికి పనులు పూర్తికాలేదు. మరోవైపు పూర్తయిన కాలువలు సైతం నీళ్లు ఇవ్వకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి. అంతర్రాష్ట్ర ఒప్పందంలోని లోపంతో కాలువలు సిద్ధమయ్యే సమయానికి ఎగువన మహారాష్ట్ర బాబ్లీ సహా ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టడంతో అసలు జలాశయంలోకి వరద రావడమే తగ్గింది. ఆ తర్వాత కాలువల నిర్వహణ లేక, నిర్మాణ లోపాలతో కాలువలన్నీ శిథిలావస్థకు చేరాయి. దీంతో అడపాదడపా వరద వచ్చిన కాలువల్లో నీళ్లు పారే పరిస్థితి లేక ప్రాజెక్టు కింద ఉన్న 14 లక్షల ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కాళేళ్వరం ప్రాజెక్టుతో కొత్త చరిత్ర
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదిత లక్ష్యాన్ని నెరవేర్చడమే కాదు, ఆయకట్టుకు శాశ్వత భరోసాను కల్పించింది కాళేశ్వరం ప్రాజెక్టునే. శ్రీరాంసాగర్ నిల్వ సామర్థ్యం 112 నుంచి 90 టీఎంసీల దిగువకు తగ్గిపోవడంతోపాటు ఎగువన మహారాష్ట్ర నుంచి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. గత 38 ఏండ్ల వరద పరిశీలిస్తే దాదాపు 25 ఏండ్లు (66 %) కరువు, 13 ఏండ్లు 34 శాతం మాత్రమే వరద వచ్చిందంటే ప్రాజెక్టు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టుకు నీటి ఢోకా లేకుండా ఉండేలా ఎస్సారెస్పీని నేడు సిద్ధంగా తీర్చిదిద్దారు. దాదాపు రూ.2వేల కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఎస్సారెస్పీకి తగినంత వరద రానిరోజుల్లో కాళేశ్వరంలో భాగంగా వరద కాలువ నుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలించే ప్రాణహిత జలాల్ని పునర్జీవ పథకం ద్వారా వెనక్కి పంపింగ్ చేసి శ్రీరాంసాగర్ జలాశయంలో పోసేలా పథకాన్ని రూపొందించారు. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చే సమయానికి పునర్జీవ పథకాన్ని కూడా రెండు దశల ఎత్తిపోతలకు సిద్ధం చేశారు. దీంతో శ్రీ రాంసాగర్పై భారం గణనీయంగా తగ్గనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ నేడు గత లక్ష్యాలను చేరుకోవడమేగాక, కొత్త చరిత్రను లిఖిస్తున్నది. వరదాయిని పేరును సార్థకం చేసుకొంటున్నది.
వరదకాలువకు, మిడ్మానేరుకు ప్రాణాధారం
వరద రావడం తగ్గిపోతున్నా ఎస్సారెస్పీపై 1990లో ఎస్సారెస్పీ వరద కాలువకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా 22 టీఎంసీలతో 2,20,000ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో మొదటగా ఎస్సారెస్పీ వద్ద ముప్కాల్ నుంచి హెడ్ రెగ్యులేటర్ ద్వారా వరదనీటిని 43.30 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా కోనరావుపేట పెద్దవాగుకు తరలించాలి. పెద్దవాగుపై కోరుట్ల వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. అక్కడి నుంచి 66.45 కిలోమీటర్ల దూరంలో మాన్వాడ సమీపంలోని మిడ్మానేర్కు తరలించాలి. అక్కడ రిజర్వాయర్ నిర్మించాలి. మిడ్మానేరు నుంచి ఎత్తిపోతల ద్వారా 63.34 కిలోమీటర్ల దూరంలో గౌరవెల్లి గ్రామ సమీపాన సర్వీస్ రిజర్వాయర్కు తరలించాలి. గ్రావిటీ ద్వారా 125 కిలోమీటర్ల దూరంలో ఆలేరుకు తరలించాలి. నాటి పాలకులు వరద కాలువ తవ్వారు.. కానీ అన్నీ మరిచారు. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ప్రాజెక్టుకు మనుగడ లేదు. తెలంగాణ ఏర్పడేనాటికి మధ్యమానేరు, తోటపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసినా పనులు పూర్తి కాలేదు. ఇవీగాక తెలంగాణ ఏర్పడేనాటికి 44 ఏండ్లలో 28.48 శాతం మేరకు నీటి నిల్వసామర్థ్యం తగ్గిపోయి, మరోవైపు మహారాష్ట్ర బాబ్లీ, తదితర ప్రాజెక్టులు నిర్మించి గోదావరిని దిగ్బంధించడంతో వరద మార్గం మూసుకుపోయింది. దీంతో వరద ఆధారంగా నిర్మించిన వరద కాల్వ ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో వరద కాలువను అనుసంధానించడంతో అది ఇప్పుడు జీవధారగా మారింది.
ఎస్సారెస్పీ మొదటి దశ.. జిల్లా ఆయకట్టు