Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు అతడి తరఫు లాయర్లు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. అంతేకాదు.. అతడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కూడా కోర్టుకు తెలిపారు.
మరోవైపు త్విషా శర్మ మృతదేహానికి రెండోసారి అటాప్సీ నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా అనుమతించింది. రెండోసారి అటాప్సీని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, తాజాగా మరోసారి అటాప్సీకి హైకోర్టు అనుమతించింది. త్విషా శర్మ మరణించి 10 రోజులు అవుతున్నా.. ఆమె మృతదేహం భోపాల్లోని ఎయిమ్స్ మార్చురీలో ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు ఆమె మృతదేహాన్ని అలా ఉంచడం సరికాదని భావించిన హైకోర్టు.. ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు రెండోసారి అటాప్సీ, ఫోరెన్సిక్ అనాలసిస్ నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది.
మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించేందుకు కూడా భోపాల్ ప్రభుత్వం అంగీకరించింది. ఆమె కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 12న త్విషా శర్మ భోపాల్లో అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మరణించింది. ఆమెది ఆత్మహత్య కాదు.. హత్య అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే ఆమె మరణించిందని ఆరోపించారు. దీంతో ఈ అంశం సంచలనంగా మారింది. మరోవైపు ఆమె భర్త సమర్ధ్ సింగ్ ఘటన జరిగిన తర్వాతి నుంచి పరారీలో ఉన్నాడు. 10 రోజులైనా ఇంకా అతడిని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు.
పైగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సాగుతుండగా.. తాజాగా ఈ పిటిషన్ను వెనక్కు తీసుకుంటున్నట్లు, ప్రధాన నిందితుడైన సమర్ద్ లొంగిపోనున్నట్లు కోర్టుకు తెలిపారు.