Janhvi Kapoor | బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి జాన్వీ కపూర్ ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో తన ప్రస్థానాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, ఇప్పటికే టాలీవుడ్లో దేవర, పెద్ది సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆమె తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.తాజా సమాచారం ప్రకారం, విలక్షణ నటుడు విక్రమ్ కుమారుడు, యువ హీరో ధృవ్ విక్రమ్ సరసన జాన్వీ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తొలిసారి ఒకే చిత్రంలో జంటగా కనిపించబోతుండటంతో ప్రాజెక్ట్పై అంచనాలు పెరుగుతున్నాయి.
ధ్రువ్ విక్రమ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు గణేష్ కే బాబు తెరకెక్కించనున్నట్లు సమాచారం. గతంలో యూత్కు బాగా కనెక్ట్ అయిన రొమాంటిక్ కథలతో ఆకట్టుకున్న దర్శకుడు, ఈసారి కూడా ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను కలిపిన ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను నేటి యువతకు దగ్గరయ్యేలా రూపొందిస్తున్నారని, ఇందులో ప్రేమకథతో పాటు బలమైన భావోద్వేగ అంశాలు కూడా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది. జాన్వీ గ్లామర్ ఇమేజ్తో పాటు ధ్రువ్ నటన శైలిని దృష్టిలో పెట్టుకుని కథను డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అలాగే ఈ చిత్రానికి భారీ నిర్మాణ విలువలు ఉండనున్నాయని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ను గ్రాండ్ స్కేల్లో నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. విజువల్స్, మ్యూజిక్, టెక్నికల్ అంశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్, లొకేషన్ ఎంపిక వంటి పనులు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ సినిమాను కేవలం తమిళ భాషకే పరిమితం చేయకుండా మల్టీ-లాంగ్వేజ్ విడుదల దిశగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేసే అవకాశాలను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.