మెదక్ : ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ధి చెప్పాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లడారు. కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 584 మందికి శుభాకాంక్షలు. ఇక నుంచి మీకు నెల నెల రూ. 2,016 అందుతాయన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రు. 75 ఉండే. ఎవరైనా చనిపోతేనే తప్పా వారి స్థానంలో నాడు కొత్తవి వచ్చేవి కావు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసింది. కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదన్నారు.
కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రు. 2,016 చేసిందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. కన్న కొడుకు చీరకొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నరు. బిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి ఇస్తున్నరు.
మాకు కులం లేదు, మతం లేదు. పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తరు. భూమికి బరువయ్యే పంట పండుతుంది.
కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి ఇది సాధ్యం అయ్యిందన్నారు. కొంత మంది ఉచితాలు వద్దు అంటారు. అలాంటి వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ జమానాలో ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్ ఉండేదని ఎద్దేవా చేశారు.