అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు యత్నం
ప్రజాగ్రహంతో తోకముడిచిన కాషాయ శ్రేణులు
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 7: హుజూరాబాద్లో కాషాయ నాయకులు తమ వంకర బుద్ధిని మరోసారి చాటుకొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నిత్యం ఏదో ఒకచోట ఘర్షణ సృష్టించి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 5న హుజూరాబాద్ మండలం సింగాపూర్లో తమ పార్టీ జెండాగద్దెను తామే కూల్చుకొని ఆందోళన చేసి పోలీసులకు అడ్డంగా దొరికారు. ఈ ఘటన మరువకముందే మరో వివాదానికి తెరలేపారు. ప్రజలు తిరగబడటంతో కంగుతిని తోకముడిచారు. శనివారం హుజూరాబాద్ మండలం రంగాపూర్లోని దళితవాడలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హాజరయ్యారు. కాగా, ఐదుగురు బీజేపీ నాయకులు అక్కడికి వచ్చి, ప్రొటోకాల్ పాటించలేదంటూ హంగామా సృష్టించారు. శంకుస్థాపన చేయొద్దని నినదించారు. దీంతో కాలనీవాసులు తీవ్ర ఆగ్రహంతో బీజేపీ నాయకులపై తిరగబడటంతో అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.