Telangana | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ మహారాష్ట్రకు అవశ్యమని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు వీలుకాకపోతే ప్రజాప్రతినిధుల క్షేత్ర పర్యటన సందర్భంగా బస చేసే ఖరీదైన హోటళ్లల్లో అయినా చర్చకు రావాలని సూచించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలను ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారే తప్ప సేవ చేయాలనే ఆలోచనతో లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తక్షణ విరుగుడు తెలంగాణ మాడల్ అని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని రంగాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ దేశ వ్యవసాయ రంగానికి ముఖచిత్రంగా మారిందని వివరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు సాగునీటి కష్టాలను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ నేతలు సహా ఎవరైనా తెలంగాణ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి రావచ్చని, తెలంగాణలో క్షేత్ర స్థాయిలో చూసిన తర్వాత మాట్లాడాలని హితవు చెప్పారు.