KTR | హైదరాబాద్ : అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జిల తొలి జాబితాను బీఆర్ఎస్ పార్టీ గురువారం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 54 నియోజకవర్గాలకు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఇంఛార్జిలుగా నియమించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జిలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇంఛార్జిలకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు కేటీఆర్ సూచించారు.
ఇంఛార్జిలుగా నియమించబడ్డ ప్రతి ఒక్క నాయకుడు ఇప్పటినుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. రేపటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులు అన్నింటిని సమన్వయం చేసుకొని పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు కేటీఆర్.
అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పార్టీ ఇంఛార్జిలకు పలు సలహాలు, సూచనలు అందించారు. రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాల సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పార్టీ ప్రచారం పకడ్బందీగా ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని తెలిపిన హరీష్ రావు ఆ దిశగా ఈ 45 రోజులపాటు విస్తృతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.