మీకు గుర్తుంది కదా..దేశానికి మొత్తం స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్కు రాలేదు. నిజాం ఇక్కడ పీఠం వేసుకొని కూర్చున్నాడా? లేదా? ఒక్క గుజరాత్ బిడ్డ సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ తన పరాక్రమం చూపి, మీకు స్వాతంత్య్రం ఖరారు చేశాడు. ఇప్పుడు ఇంకో గుజరాత్ బిడ్డ (మోదీ) మీ అభివృద్ధి, వికాసం, ప్రగతి కోసం వచ్చాడు.
-నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
అత్యున్నత స్థితి! అంగుష్ట బుద్ధి!
తెలంగాణపై మోదీ ప్రేలాపన!
తెలంగాణ రాష్ట్ర పుట్టుకను పదే పదే అవమానిస్తున్న మోదీ.. తెలంగాణ స్వాతంత్య్ర పోరాటాన్ని ఇవాళ నిజామాబాద్లో అవమానించారు. అంతేకాదు, స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ స్థాయిని తగ్గించేలా మాట్లాడారు. ఒక గుజరాతీ వల్లనే తెలంగాణకు స్వాతంత్య్రం దక్కిందట. ఇపుడు ఇంకొకరు మళ్లీ తెలంగాణను విముక్తి చేస్తారట.
భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడిని, జాతి నేతను గుజరాతీ నాయకుడని పిలవడం ద్వారా ఉక్కుమనిషిని అవమానిస్తారా?
సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ గుజరాతీ కాదు! భారత స్వాతంత్య్ర సమర యోధుడు.
నెహ్రూకు సరితూగే నాయకుడు.. ముక్కలుగా ఉన్న దేశానికి ఒక రూపునిచ్చిన ఉక్కుమనిషి.
భారత దేశానికి తొలి ఉపప్రధాని, హోం శాఖ మంత్రి. హైదరాబాద్ స్టేట్ ప్రజల పోరాటానికి స్పందించి, వారి వినతి మేరకు, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి భారత సైన్యం హైదరాబాద్ను విముక్తం చేసింది. సర్దార్ దేశ ఉప ప్రధానిగా నిర్ణయం తీసుకున్నారు తప్ప గుజరాతీగా కాదు. దేశ నాయకుడైన సర్దార్ స్థాయిని గుజరాతీ అంటూ ప్రధాని మోదీ పరిమితం చేయడం విచారకరం.
ఎవరో దయతలిస్తే హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్య్రం వచ్చిందా? ఇది ఎవరో వేసిన భిక్షా? అది ప్రజల కోరిక మేరకు భారత సైన్యం అండతో భారత ప్రభుత్వం సాధించిన ఘనత. అంతకు ముందే ఇక్కడ ఉద్యమాలు జరగలేదా? ప్రజలు ప్రాణాలొడ్డి సాయుధ పోరాటం చేయలేదా? పౌరుషానికి ప్రతిరూపమైన ఈ గడ్డ విమోచనం ఎవరి దయ కాదు. బిచ్చం కాదు. బందూకులు పట్టి నిరంకుశ సైన్యాన్ని ఉరికించిన నేల ఇది. ఆడబిడ్డలు కొంగు బిగించి, ఉన్మాదుల విచ్చుకత్తుల కోలాటంలోనూ జాతీయజెండాను ఎగరేసి సగర్వంగా తల ఎగరేసిన నేల ఇది. ఇది ప్రజలు సాధించుకున్నది. దిక్కుమాలిన రాజకీయం కోసం ప్రాణాలర్పించిన ప్రజలను, రైతాంగ సాయుధ పోరాట వీరులను, వారి త్యాగాలను అవమానిస్తారా? నాలుగు ఓట్ల కోసం చరిత్రను అవహేళన చేస్తారా?
ఆంధ్రా పాలకులూ ఇదే అహంకారం ప్రదర్శించారు. తెలంగాణకు తామే తినడం, బట్టకట్టడం నేర్పామన్నారు. తెలంగాణోడికి పాలన చేతకాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే చీకటేనన్నారు. కానీ తెలంగాణ గెలిచి, నిలిచింది. ఈ రోజు దేశం నడిబొడ్డున శిఖరంలా సగర్వంగా, సమున్నతంగా నిలబడింది. ఇప్పుడు ‘గుజరాతీ ప్రధాని’ వంతు! వికాసాన్ని ప్రసాదిస్తానంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు. తెలంగాణ ఆత్మగౌరవంపై చవకబారు వ్యాఖ్యలు.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ. కూలదోయాలనుకున్నప్పుడల్లా లేచి నిలబడిన నేల. అణచివేతదారులను తరిమిన గడ్డ. అత్మగౌరవ పతాకాన్ని గుండెల్లో మోస్తున్న నేల. మాట అంటే పడని నేల. మోసం అంటే విరుచుకుపడే నేల. మాయ చేయ ప్రయత్నిస్తే తరిమివేసే నేల.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్ సభలో మాట్లాడిన తీరుపై తెలంగాణ ప్రజలు, మేధావులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేకపోవటంతో చెప్పుకోవటానికి ఏమీ లేక, రాష్ట్రప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడుతున్నారు. మోదీ ప్రధాని పదవికి తగని రీతిలో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తన 9 ఏండ్ల పాలనలో తెలంగాణకు మోదీ ఇచ్చింది లేదు.. తెచ్చింది లేదు.. తరుచూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విమర్శించటం తప్ప ఏనాడూ ప్రశంసించింది కూడా లేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏం చెప్పుకోవాలో తెలియక సీఎం కేసీఆర్పై లాజిక్లేని విమర్శలకు దిగుతున్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోదీ ప్రచారానికి వెళ్లి భారీగా ప్రాజెక్టులు, నిధులు ప్రకటించటం పరిపాటి. కానీ, తెలంగాణకు మాత్రం ఉత్తచేతులతో వచ్చి శాపనార్థాలు పెట్టి వెళ్తున్నారని మండిపడుతున్నారు. ప్రధానిననే విషయం కూడా మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, గల్లీ లీడర్ల మాదిరిగా పచ్చి అబద్ధాలు వల్లె వేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తనవద్దకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరుతామని చెప్పారని, కానీ తాను తిరస్కరించానని పరమ రహస్యమేదో బయటపెట్టినట్టు మోదీ ఊరించి ఊరించి చెప్పారు. వందమంది ఎమ్మెల్యేలున్న పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీని చూసి భయపడుతుందా? కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ను ఇతర రాష్ర్టాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తూ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన ఎన్డీయేలో ఎందుకు చేరటానికి మొగ్గుచూపుతారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ మొదటి నుంచీ విమర్శిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఆ ప్రభుత్వాన్ని నడిపే ఎన్డీయేలో ఎందుకు చేరుతారని నిలదీస్తున్నారు.
బీజేపీతో చేతులు కలుపడం అంటే పార్టీకి ఉరితాడు సిద్ధం చేసుకున్నట్టే. ఇందుకు శివసేన, ఎన్సీపీ ప్రత్యక్ష ఉదాహరణలు. బీజేపీతో స్నేహం చేసిన పాపానికి.. ఆ రెండు పార్టీలూ నిలువునా చీలిపోయాయి. పంజాబ్కు చెందిన శిరోమణి అకాలీదళ్ దేశంలోనే రెండో ప్రాచీన పార్టీ. ఆరుసార్లు పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఆ పార్టీ సొంతం. కానీ.. ఎన్డీయేతో కలిసిన తర్వాత బీజేపీ క్రమంగా మింగేయడంతో ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు సాధించిన ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఏపీలో టీడీపీ పరిస్థితి కూడా అంతే. స్నేహం చేసిన పార్టీలనే మింగేసే చరిత్ర బీజేపీది. ఇలాంటి పరిణామాలే జరుగుతుండటంతో బీహార్లో జేడీయూ, తమిళనాడులో అన్నాడీఎంకే ముందుగానే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాయి. అలాంటి కూటమిలో సీఎం కేసీఆర్ ఎందుకు చేరుతారన్నది నిపుణుల ప్రశ్న. వచ్చాం కాబట్టి ఒక నింద వేసిపోవాలన్న ఉద్దేశం తప్ప మోదీ వ్యాఖ్యల్లో కొంత కూడా వాస్తవం లేదని స్పష్టం అవుతున్నది.
కేటీఆర్ను సీఎంను చేస్తానని, అందుకు తన ఆశీస్సులు కావాలని కోరినట్టు ప్రధాని మోదీ గొప్పలకు పోయారు. బీఆర్ఎస్కు రాష్ట్ర అసెంబ్లీలో 100 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. కేటీఆర్ను సీఎంను చేయాలంటే బీఆర్ఎస్ఎల్పీ నిర్ణయం తీసుకొంటుంది. దానికి బీజేపీ అనుమతి అవసరం లేదు. మోదీ ఆశీస్సులు అస్సలే అవసరం లేదు. మరి కేసీఆర్ తనను ఆశీస్సులు కోరారని మోదీ చెప్పటంలో లాజిక్ ఏమైనా ఉన్నదా? అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని రాష్ర్టాల ముఖ్యమంత్రులంతా మోదీ ఆశీస్సులతోనే ఆ పదవులు చేపట్టారా? అని నిలదీస్తున్నారు. కేటీఆర్ను సీఎంను చేయాలని బీఆర్ఎస్ఎల్పీ నిర్ణయిస్తే బీజేపీకి ఆపే శక్తి ఉన్నదా? అని ఎద్దేవాచేస్తున్నారు.
బీజేపీకి అధికారమిస్తే బీఆర్ఎస్ సర్కారు అవినీతిని బయటపెడుతామని మోదీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా? దాదాపు పదేండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇంతకాలం ఏం చేస్తున్నట్టు? ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం జేబు సంస్థలుగా వాడుకొని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి తెలంగాణలో సీఎం కేసీఆర్పైనో, మంత్రులపైనో ఎందుకు ప్రయోగించడం లేదు? ఇక్కడ అవినీతి జరిగితే ఎందుకు ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారు? అని ప్రజలు నిలదీస్తున్నారు.
ఇటీవలే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి, సీఎం కేసీఆర్ను తమ ఇండియా కూటమిలోకి రావొద్దని అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాత్రం ఇండియా కూటమి సమావేశాలకు కేసీఆర్ హాజరుకావటంలేదని విమర్శించారు. కూటమిలో చేరాలని ఆహ్వానించినా కేసీఆర్ రావడం లేదని ఒప్పుకున్నారు. ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్లో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో చేరుతానని సీఎం కేసీఆర్ అడిగినా తాను వద్దన్నానని గప్పాలు కొట్టారు. రేపు మరో బీజేపీ నాయకుడు వచ్చి ‘ఎన్డీయే కూటమిలోకి సీఎం కేసీఆర్ను ఆహ్వానించినా రావడం లేదు’ అని చెప్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండు కూటములకు సీఎం కేసీఆర్తో, బీఆర్ఎస్తో అవసరం ఉన్నది. తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న బీఆర్ఎస్కు మహారాష్ట్ర, ఏపీతోపాటు అనేక రాష్ర్టాల్లో పెరుగుతున్న ఆదరణను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ‘కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయ వేదిక’ అనే నినాదాన్ని ఎత్తుకోవడంతో ఆ పార్టీలకు భయం పట్టుకొన్నది. అందుకే అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ, సీఎం కేసీఆర్ పరపతిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు.