హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా ఆ హామీ ఊసే ఎత్తడం లేదు. పైగా ఉన్న పింఛన్లలో భారీగా కోత పెట్టారు. దీంతో పింఛన్లు పెరగకపోగా, వచ్చే పింఛన్ కూడా రాకుండా చేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఓట్లు వేసి మోసపోయామని వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ 27 నెలల్లో ఒక్క పింఛన్ మంజూరు చేయలేదు, కానీ ఏకంగా 1.5 లక్షల మందికి పింఛన్లు తొలగించింది. గత సీఎం కేసీఆర్ పాలనలో 43,72,784 మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వగా, ప్రస్తుతం 42.50 లక్షల మందికే ఇస్తున్నారు. అది కూడా పాత పద్ధతిలో వృద్ధులు, బీడీ కార్మికులు, గీతన్నలు, నేతన్నలు, ఒంటరి మహిళలు, డయాలసిస్, ఎయిడ్స్ పేషెంట్లు, ఫైలేరియా బాధితులకు రూ. 2,016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4,016 చొప్పున ఇస్తున్నారు. పైగా 2024 ఆగస్టు, 2025 జనవరి నెలలకు సంబంధించిన పింఛన్లను సైతం ఎగ్గొట్టింది.
రెండేండ్లుగా ఎదురుచూపులు
కొత్త పింఛన్ల మంజూరు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించగా, సుమారు 25 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే కొత్తవారికి మంజూరు చేస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ప్రకటనలు చేశారు. కానీ నేటికి ఏ ఒక్క లబ్ధిదారుడికి పింఛన్ మంజూరు చేసిన దాఖలాలు లేవు. పైగా పింఛన్ గురించి ప్రజాప్రతినిధులను ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. దీంతో పిం ఛన్ల పెంపు, కొత్త పింఛన్ల మంజూరు కోసం మండల పరిషత్ ఆఫీసులు, అధికారుల చుట్టూ రోజూ చక్కర్లు కొడుతున్నారు.
పోరుబాటలో లబ్ధిదారులు
పింఛన్ల పెంపు, కొత్తవాటి కోసం 27 నెలలుగా నిరీక్షించిన లబ్ధిదారులు కాంగ్రెస్ సర్కార్పై పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కురుసనెల్లి వెంకట్ హెచ్చరించారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు మాత్రం గడప దాటంలేదని మండిపడ్డారు. వచ్చే శాసన బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడించేందుకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి ఒకటి రెండురోజుల్లో కలిసివచ్చే పార్టీలు, సంఘాలతో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
27 నెలల్లో రూ. 24వేల కోట్లు బాకీ
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు పింఛన్ల లబ్ధిదారులకు ప్రతినెలా రూ. 4వేల చొప్పున (దివ్యాంగులకు 6వేల చొప్పున) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతినెలా రూ.900 కోట్లు ఖర్చు చేస్తుండగా, మరో రూ.900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుకు రూ. 54 వేల చొప్పున రూ. 24వేల కోట్లకు పైగా బాకీ పడ్డది.