ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వాన (Heavy rain) దంచికొడుతున్నది. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో (Floods) పెన్గంగ (Penganga) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. జైనాథ్ (Jainad) మండలం అనంతపూర్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో మండలంలోని ఆనందపూర్, కూర, కరంజి, కాపరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిదంగా జైనాథ్, వేల మండలాల నుంచి మహారాష్ట్రకు (Maharashtra) వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
కాగా, ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు పేర్కొన్నది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.