హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేత రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. బుధవారం ఆయన ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులను వివరించారు.
సింగరేణి కార్మికుల ఆదాయం పన్ను మినహాయింపులు, సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే ప్రాజెక్టులు, హాల్టులు, నూతన సర్వీసులు, మౌలిక సదుపాయాలు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నవోదయ విద్యాలయాల మంజూరు, నేషనల్ హైవే ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకహోదా తదితర అంశాలపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయా మంత్రిత్వశాఖలతో తాను జరిపిన చర్చల గురించి కేటీఆర్కు వివరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెద్దపల్లి నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం రావడంలేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.