హైదరాబాద్: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు (Birudu Rajamallu) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
1930లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాజమల్లు.. తన రాజకీయ జీవితాన్ని టీడీపీలో మొదలుపెట్టారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. తరువాత 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో అదే అభ్యర్థిని 39 వేల 677 ఓట్ల మెజార్టీతో మట్టికపిరిపించి తొలి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో బీఆర్ఎస్లో చేరారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.