హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ, విద్యుత్తు రంగంలో నూతన రికార్డులు లిఖిస్తున్నామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. నిరుడు మార్చి 24న 14,160 మెగావాట్లు రికార్డుగా ఉండేదని, శుక్రవారం దానిని అధిగమించామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో గరిష్ఠ డిమాండ్ కన్నా ఇది 100 మెగావాట్లు అధికమని చెప్పారు. ఇది తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సంస్థల పనితీరు, విజయానికి చిహ్నంగా అభివర్ణించారు. అసెంబ్లీలో శుక్రవారం విద్యుత్తు రంగ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది గరిష్ఠ డిమాండ్ మరో వెయ్యి మెగావాట్లు పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో రూ.38,328 కోట్లు ఖర్చు చేసి సరఫరా వ్యవస్థలను అప్గ్రేడ్ చేశామని, 18 వేల మెగావాట్ల డిమాండ్ను తట్టుకోగలమని వివరించారు. పాతబస్తీలో బిల్లుల వసూళ్లపై దుష్ప్రచారం చేస్తున్నారని, అక్కడ అన్ని ప్రాంతాలతో సమానంగా 95 శాతం బిల్లులు వసూలు అవుతున్నాయని చెప్పారు.
కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ప్రతిపక్షాల తీరు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ నిర్వాకం వల్ల రాష్ట్రంలో రెండు రోజులు 24 గంటల సరఫరాలో చిన్న అంతరాయాలు తలెత్తాయని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా విమర్శలు చేశాయని ఎద్దేవాచేశారు. శుక్రవారం నుంచి తిరిగి 24 గంటల విద్యుత్తును పునరుద్ధరించామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం 2020 నుంచి ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు 2,000 మెగావాట్ల విద్యుత్తు రావాల్సి ఉన్నదని వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో 398 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 360 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తామని లేఖ రాశారని, దానిని నమ్మి తాము అంచనాలు వేసుకుంటే.. మొండిచేయి చూపారని పేర్కొన్నారు. మరోవైపు రెండు విద్యుత్తు ఉత్పత్తి స్టేషన్లు ట్రిప్ కావడంతో 1,200 మెగావాట్ల సరఫరా ఆగిందని, దీంతో అంతరాయం ఏర్పడిందని వివరించారు. రెండేండ్లుగా ఎన్టీపీసీ నుంచి విద్యుత్తు రాక బయట కొనుగోళ్లు చేయడం వల్ల రాష్ర్టానికి రూ.9,637 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు.
తల్లే దయ్యమైనట్టుగా కేంద్రం తీరు
విద్యుత్తురంగంలో అసాధారణంగా దూసుకుపోతున్న తెలంగాణను కేంద్రం ప్రోత్సహించాల్సిందిపోయి.. తల్లే దయ్యమైందన్నట్టుగా వ్యవహరిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. అసంబద్ధమైన నిబంధనలు పెట్టి విద్యుత్తు కోతలు ప్రకటించేలా కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు కేంద్ర సంస్థలు, బ్యాంకులు ఇచ్చే రుణాలు, దామరచర్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్కు ఇచ్చే రుణం ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్తు కొనుగోలు కోసం ఇప్పటివరకు యూనిట్కు సగటున రూ.4.70 ఖర్చు చేస్తున్నామని, అత్యధికంగా రూ.9.02 చెల్లించామని వివరించారు. అత్యధికంగా ఎన్టీపీసీ కుర్గి నుంచి రూ.9.02, సింహాద్రి నుంచి రూ.6.23కు యూనిట్ కొనుగోలు చేస్తున్నామని, ఈ ఒప్పందాలు కాంగ్రస్ హయాంలోనే జరిగాయని వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రైవేట్ విద్యుత్తు కొనటం లేదని చెప్పారు. కేంద్రం ఆధ్వర్యంలోని పవర్ ఎక్సేంజ్ నుంచే కొనుగోలు చేశామని తెలిపారు. థర్మల్ ప్లాంట్లలో 30% విదేశీబొగ్గు వాడాలన్న కేంద్రం నిబంధనను సీఎం కేసీఆర్ ధిక్కరించారని చెప్పారు. పూర్తిగా సింగరేణి బొగ్గునే వాడుతున్నట్టు చెప్పారు. సింగరేణి నుంచి రూ.3,600కే టన్ను బొగ్గు లభిస్తే, విదేశీబొగ్గు రూ.24 వేలు పలుకుతున్నదని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని బీజేపీ సీఎంలు కూడా వ్యతిరేకించారని అన్నారు. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్లో ఇప్పటికీ 24 గంటల సరఫరా లేదని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దగ్గర నేర్చుకొని వెళ్లాలని సూచించారు.