హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): బియ్యం సేకరణలో కేంద్రం మళ్లీ కొత్త పేచీలు పెడుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణలో పూటకో నిబంధన విధిస్తున్నది. మొన్నటివరకు బాయిల్డ్ రైస్ వద్దంటూ సతాయించిన కేంద్రం ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (ఒక శాతం సూక్ష్మ పోషకాలు, 99 శాతం బియ్యం మిశ్రమం) ఇవ్వాలని మంకుపట్టు పడుతున్నది. సీఎమ్మార్లో బాయిల్డ్ రైస్ 50 శాతం, ఫోర్టిఫైడ్ రైస్ 50 శాతం చొప్పున ఇవ్వాలని ఇటీవల రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) లేఖ రాసింది. ఒకవేళ కేంద్రానికి ఫోర్టిఫైడ్ రైస్ అవసరం ఉంటే, ఆ విషయాన్ని రాష్ర్టాలకు ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎఫ్సీఐ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సీఎమ్మార్ డెలివరీ ప్రారంభమైన తర్వాత కొత్త ఆంక్షలు విధిస్తున్నది. ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లు గతంలోనే కేంద్రానికి స్పష్టం చేశారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారుచేసే సౌకర్యం ఇక్కడి మిల్లుల్లో లేదని, ఆ పరికరాలను ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, దానికి సమయం పడుతుందని వివరించారు. అయినప్పటికీ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సిందేనని ఎఫ్సీఐ జిల్లా మేనేజర్లు ఒత్తిడి పెడుతున్నారని, బాయిల్డ్రైస్ తీసుకోబోమని బెదిరిస్తున్నారని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020-21 యాసంగిలో 63 లక్షల టన్నుల సీఎమ్మార్ ఇవ్వాల్సి ఉండగా అందులో బాయిల్డ్ రైస్ కేవలం 24.75 లక్షల టన్నులు మాత్రమే తీసుకొంటామని కేంద్రం తెలిపింది. ఈ కోటాను పెంచేందుకు ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు ఢిల్లీలో మకాం వేయడంతో పాటు పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు కేంద్రం అంగీకరించింది. కేంద్రం నిర్దేశించిన 44.75 లక్షల టన్నుల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 39 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐకి అందజేసింది. కేంద్రం ఇచ్చిన కోటా ప్రకారం ఇంకా 5.65 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఇవ్వాల్సి ఉండగా, ఇందులో సగం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని ఎఫ్సీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మొత్తం 63 లక్షల టన్నుల సీఎమ్మార్లో 44.75 లక్షల టన్నుల బాయిల్డ్రైస్ పోగా మరో 18.25 లక్షల రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, యాసంగిలో బాయిల్డ్రైస్ వస్తున్నందున రా రైస్ ఎలా ఇవ్వాలనే దానిపై మిల్లర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సీఎమ్మార్ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. దీంతో ఈ గడువు మే నెలాఖరు వరకు పొడిగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. 2019లో 58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా అప్పట్లో సీఎమ్మార్ గడువును మే వరకు ఇచ్చారు. 2021 యాసింగిలో ధాన్యం కొనుగోలు 93 లక్షల టన్నుల కు పెరిగినప్పటికీ, సీఎమ్మార్ గడువును పొడిగించకపోగా ఫిబ్రవరి నెలాఖరు వరకే కుదించడం గమనా ర్హం. సీఎమ్మార్ గడువు విషయంలోనూ కేంద్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి.
ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై ఈ నెల 25న ఎఫ్సీఐ అన్ని రాష్ర్టాల పౌరసరఫరాలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నది. యాసంగిలో బాయిల్డ్రైస్ కొనేది లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు వెలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.