హైదరాబాద్ : నగరంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న మహిళ పై పోలీసులు పీడీ కేసు నమోదు చేశారు. నగరంలోని ఫతేనగర్కు చెందిన మహిళ(40) కొన్ని సంవత్సరాలుగా గంజాయిని విక్రయిస్తుందని మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ తెలిపారు. బుధవారం బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సదరు మహిళపై బాలానగర్ ఎస్సైజ్ స్టేషన్లల్లో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు.
బాలానగర్ తహసీల్దార్ వద్ద ఐదుసార్లు ఆమెను బైండోవర్ చేశామని, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమె రూ. 7లక్షల జరిమానా రూపంలో చెల్లించిందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులపై కూడా గంజాయి విక్రయ కేసులు నమోదయ్యాయని, వీరిలో కొందరూ జైలులో, మరికొందరూ పరారీలో ఉన్నారని వివరించారు. సదరు మహిళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ఆమెపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.