న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) చాలా తక్కువ సంఖ్యలో ఉన్న శాశ్వత సిబ్బందితో పనిచేస్తున్నదని ప్రభుత్వం ధ్రువీకరించింది. మంజూరైన 39 శాశ్వత పోస్టులకుగాను ప్రస్తుతం ఎన్టీఏలో కేవలం 24 మంది అధికారులు మాత్రమే పనిచేస్తున్నారని, 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ రాజ్యసభకు తెలిపారు. ముఖ్యంగా శాశ్వత పోస్టులన్నీ ప్రత్యక్ష నియామకాల ద్వారా కాకుండా డిప్యుటేషన్ ద్వారానే భర్తీ చేయబడ్డాయి. పరిపాలన సాగడానికి ఈ ఏజెన్సీ తాత్కాలిక, అవుట్సోర్స్ సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. ప్రస్తుతం ఇందులో అడ్వైజర్లు, కన్సల్టెంట్లు, యంగ్ ప్రొఫెషనల్స్తో సహా 73 మంది కాంట్రాక్టు సిబ్బంది, అలాగే డాటా అనలిస్టులు, లీగల్ అసోసియేట్స్ వంటి 124 మంది అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు. సీపీఐ(ఎం) ఎంపీ వీ శివదాసన్ అడిగిన ప్రశ్నలకు మజుందార్ ఈ సమాధానం ఇచ్చారు. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ ద్వారా భర్తీ చేసేందుకు డైరెక్టర్ స్థాయిలో ఎనిమిది, జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఎనిమిది చొప్పున మొత్తం 16 కొత్త పోస్టుల ఆమోదంతో ఎన్టీఏ ప్రధాన బృందాన్ని బలపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.
ఈ సిబ్బంది సరిపోతారా?
2018లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్టీఏ 270కి పైగా పరీక్షలను నిర్వహించింది. 6.6 కోట్లకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ ఒక్క ఏడాదే నీట్ యూజీ సహా 65 లక్షల మందికి పైగా అభ్యర్థులకు సంబంధించి 12 పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 21న మళ్లీ పరీక్ష జరుగగా, జూలై 16న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షలకు సంబంధించిన అనేక వివాదాల నేపథ్యంలో ఎన్టీఏపై ప్రజల్లో పరిశీలన పెరుగుతున్న తరుణంలో ఈ వివరాలు వెలువడ్డాయి. ఏటా కోట్లాది మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే ఏజెన్సీకి తగినంత సిబ్బంది ఉన్నారా అనే కొత్త ప్రశ్నలను ఇది లేవనెత్తుతున్నది.