జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. యాదగిరిగుట్ట ఆలయం తరహాలోనే తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100కోట్లు కేటాయించడంతో పాటు స్వయంగా క్షేత్రాన్ని పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో అటశీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ కొండగట్టులో పర్యటించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తనవంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫున కొండగట్టును ఆనుకుని ఉన్న కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు.
అటవీశాఖతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంయుక్తంగా కొడిమ్యాల అటవీ పునరుద్ధరణ పనులు చేపట్టనున్నాయి. కొండగట్టు ఆలయాన్ని అనుకొని విస్తారమైన ఈ కొడిమ్యాల అటవీ ప్రాంతం ఉంది. ఈ క్రమంలో పీసీసీఎఫ్ అటవీ ప్రాంతం పునరుద్ధరణ, అభివృద్ధికి తగు ప్రణాళికలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాల్లోని రెండు అటవీ బ్లాకుల్లో చేయాల్సిన అభివృద్ధిపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముందుగా అటవీ ప్రాంతం చుట్టూ అవసరమైన చోట్ల రక్షణ కంచె ఏర్పాటు చేయనున్నారు.
సుమారు 5 కిలోమీటర్లు కాలినడక మార్గం (వాకింగ్ ట్రాక్) మట్టితో ఏర్పాటు.. వెయ్యి ఎకరాలలో ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, అందుకోసం అవసరమైన తగిన నర్సరీల ఏర్పాటు, వాచ్ టవర్ నిర్మాణం, భక్తులు సేద తీరేందుకు వీలుగా గజేబో నిర్మాణం తొలిదశలో చేపట్టనున్నారు. ఆలయ పరిసరాల్లో విస్తారంగా తిరిగే కోతుల ఆహారం కోసం అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పీసీసీఎఫ్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన వెంట ముఖ్య అటవీ సంరక్షణ అధికారి శరవణ్, జగిత్యాట డీఎఫ్వో వెంకటేశ్వరావు, రేంజ్ ఆఫీసర్ లత, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మౌనిక, బీట్ ఆఫీసర్ శ్రీసాయిరాం ఉన్నారు.