Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): సీపీఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారన్న అనుమానం కాంగ్రెస్ శ్రేణులను వెటాండుతున్నది. సీపీఐతో పొత్తు కోసం ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లి చర్చలు జరిపిన రేవంత్రెడ్డి.. సీపీఎం విషయంలో చొరవచూపకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను ఓడించడమే లక్ష్యంగా సీపీఎంతో పొత్తు కుదరకుండా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టార్గెట్గా ఈ ప్లాన్ను అమలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిర నియోజకవర్గం సీపీఎంకు బలమైన కేంద్రం. అందుకే సీపీఎంతో పొత్తుకు భట్టి విక్రమార్క మొదటి నుంచీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయనతోపాటు మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా తనవంతుగా ప్రయత్నం చేశారు. రేవంత్ మాత్రం సీపీఎంతో పొత్తుకు ససేమిరా అన్నట్టు తెలిసింది. పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు, ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే కుట్రలకు రేవంత్రెడ్డి తెరలేపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీపీఎంతో పొత్తు కోసం కాంగ్రెస్ తరఫున స్వయంగా సోనియాగాంధీ రంగంలోకి దిగారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరికి ఆమె ఫోన్ చేశారు. పొత్తుకు సహకరించాలని, ‘ఇండియా’ కూటమిలాగే ఐక్యంగా కలిసి పనిచేయాలని కోరారు. దీంతో తమ్మినేనికి ఏచూరి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. మిర్యాలగూడ, వైరా సీట్లు లేకుండా చర్చలు అవసరం లేదని సీతారాం ఏచూరికి తమ్మినేని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇప్పటికే 14 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించిన సీపీఎం సోమవారం మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. హుజూర్నగర్ అభ్యర్థిగా మల్లు లక్ష్మి, నల్లగొండ అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్రెడ్డి పోటీ చేస్తారని తెలిపింది. కోదాడ అభ్యర్థిని మంగళవారం ప్రకటిస్తామని, మునుగోడు, ఇల్లందు స్థానాల్లో కూడా పోటీ చేసే ఆలోచన ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం ఆయన ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై కాంగ్రెస్ తమతో సరిగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భట్టి విక్రమార్క, జానారెడ్డి వేర్వేరుగా మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి కూడా తనకు ఫోన్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐకి ఒక ఎమ్మెల్యే సీటు, ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని, సీపీఎంకు కూడా ఇదే రీతిలోని ఇస్తామన్నారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో సీటు ఇవ్వకపోతే పొత్తుకు ఒప్పుకునేది లేదని తమ్మినేని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, సీపీఐ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారైంది. సీపీఐకి కేవలం ఒకే ఒక్క సీటుతో కాంగ్రెస్ సరిపుచ్చింది. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించింది. భవిష్యత్తులో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చేందుకు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలు కే నారాయణ, చాడ వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు తదితరులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోమవారం పొత్తులపై చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నారు.