హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తేతెలంగాణ): మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి తెలిపారు. శనివారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధంగా అన్నీ ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాతే ముందుకెళ్తామని ఎన్జీటీకి ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. లేదంటే తిరిగి తమ వద్దకు రావాలని ఎన్జీటీ సూచించిందని వెల్లడించారు.
అసెంబ్లీలో సర్కార్ చెప్పని వివరాలను సైతం ఎన్జీటీ ఎదుట చెప్పించామని పేర్కొన్నారు. కోర్టుకు చెప్పిన అంశంలో ఏ ఒక్కటి చేయకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూసీ రివర్ ప్రాజెక్ట్ను చేపట్టడంలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ సబర్మతి రివర్ఫ్రంట్ చేసిన విధంగా తన పరపతి పెంచుకొనేందుకే మూసీని ముందుకుతెచ్చారని దుయ్యబట్టారు. ప్రజల కోణంలో పనులు చేయకపోతే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు.