Karthik Reddy | హైదరాబాద్ : తాము బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, చివరి శ్వాస వరకు కేసీఆర్తోనే తమ ప్రయాణం కొనసాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కార్తీక్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రంగారెడ్డి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది. నాన్న పటోళ్ల ఇంద్రారెడ్డికి ఐదు సార్లు, అమ్మ సబితమ్మకు ఐదు సార్లు అవకాశం ఇచ్చారు. 1983 నుంచి ఇప్పటి వరకు పదిసార్లు జిల్లా ప్రజల ఆశీస్సులు పొందాం. మా ప్రస్థానం వేరు.. ఇప్పుడు పార్టీలు మారుతున్న వారి ప్రస్థానం వేరు. వారికి మాకు చాలా తేడా ఉందని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇంద్రారెడ్డికి ఎన్టీ రామారావు భిక్ష పెట్టారు. 1994లో ఆగస్టు కుంభకోణం తర్వాత ఎన్టీ రామారావుతో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇంద్రారెడ్డి ఒకరు. ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్ పార్టీలో చేరాం. రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు ఇబ్రహీంపట్నం నుంచి తాండూరు వరకు కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం, నష్టం వచ్చినా మా అమ్మ కాలు అరిగేలా తిరిగింది. పార్టీ కోసం కష్టపడింది. నమ్మకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అమ్మ మీద ఐదు సీబీఐ కేసులు పెట్టింది. వేరే వారికి రెండు మూడు టికెట్లు ఇచ్చి, మాకు ఒక టికెట్ ఇచ్చి అవమాన పరిచేలా ప్రవర్తించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఖతం చేయాలని ప్లాన్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కేసీఆర్, కేటీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించి, అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్కు మేం వెన్నుపోటు పొడవలేదు. పార్టీనే మాకు వెన్నుపోటు పొడించింది. ఇప్పుడు పార్టీలు మారేవారితో మమ్మల్ని పోల్చకండి. ఏ విధంగానైతే ఎన్టీఆర్, వైఎస్సార్తో ఎలా ఉన్నామో కేసీఆర్ వద్ద కూడా చివరి శ్వాస ఉంటాం అని కార్తీక్ రెడ్డి తేల్చిచెప్పారు.