AP Bhavan | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తన పంతాన్ని నెగ్గించుకున్నది. ఊహించినట్టుగానే రేవంత్రెడ్డి ప్రభుత్వం రాజీ పడటంతో ఏపీ పైచేయి సాధించింది. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఢిల్లీకే తలమానికంగా భాసిల్లుతూ అంతర్జాతీయ స్థాయి చర్చలకు వేదికగా నిలుస్తున్న అద్భుత రాజప్రాసాదం ‘హైదరాబాద్ హౌస్’ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినా తెలంగాణకు ఫలితం దక్కలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. ఏపీ భవన్కు ఉన్న మొత్తం 19.781 ఎకరాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం దక్కాల్సి ఉన్నది. మొత్తం రూ.7,110 కోట్ల విలువైన ఈ ఆస్తిలో తెలంగాణకు రెండు ముక్కలుగా 8.245 (శబరి బ్లాక్లో 3, పటౌడీ హౌస్లో 5.245) ఎకరాలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీకి 11.536 (గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.781, నర్సింగ్ హాస్టల్లో 3.359, పటౌడీ హౌస్లో 2.396) ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు ఇరు వర్గాలు ఆమోదం తెలపడంతో ఏపీ భవన్ విభజన ప్రక్రియను పూర్తిచేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
పదేండ్లు కష్టపడ్డా ఫలితం సున్నా
వాస్తవానికి ఈ ప్రతిపాదనలు ఆది నుంచే ఉన్నాయి. తెలంగాణకు ఆ ఆస్తులే కావాలనుకుంటే గత సీఎం కేసీఆర్ మొదట్లోనే అంగీకారం తెలిపేవారు. కానీ, అత్యంత విలువైన చారిత్రక సంపదను దేశానికి అందించిన తెలంగాణకు ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో పదేండ్లపాటు పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఏపీ భవన్ ఆస్తుల్లో ఏపీకి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం పంచేందుకు ప్రతిపాదించింది. దీనికి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు. హైదరాబాద్ హౌస్కు ప్రత్యామ్నాయంగా ఏపీ భవన్ మొత్తం ఆస్తిని తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఏపీకి మరోచోట భూములు కేటాయించాలని సూచించారు. దీనికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో తెలంగాణకు వచ్చే 8 ఎకరాలను ముక్కలు ముక్కలుగా ఇవ్వవద్దని, పటౌడీ హౌస్ను ఆనుకుని ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఆ ఎనిమిదెకరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా భవన్ను నిర్మించుకుంటామని ప్రతిపాదించారు. దీనికి కేంద్రంతోపాటు ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోవడంతో ఏపీ భవన్ విభజన పెండింగ్లో పడింది. కానీ, ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించి, తమ ఘనతగా చెప్పుకోవాలని తాపత్రయపడుతున్న రేవంత్రెడ్డి సర్కారు ఏపీ భవన్ విభజన విషయంలో రాజీ పడింది. ఏపీ కోరుకున్న విధం గా ఆస్తుల పంపకానికి ఒప్పుకోవడంతో తెలంగాణకు పటౌడీ హౌస్లో 5 ఎకరాలు, శబరి బ్లాక్లో 3 ఎకరాలు లభించాయి. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.
తెలంగాణ భవన్ నిర్మాణానికి ప్రణాళికలు
ఏపీ భవన్ విభజన పూర్తవగానే అక్కడ తెలంగాణ భవన్ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. పటౌడీ హౌస్లోని 5.245 ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నది. శబరి బ్లాక్ చాలా పురాతనమైనది కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా? లేక ఆ బ్లాక్ను యథాతథంగా ఉంచి పటౌడీ హౌస్లోని 5.245ఎకరాల ఖాళీ జాగాలో నిర్మిస్తే సరిపోతుందా? అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.