హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో పునాది పడిన మరో ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. పామాయిల్ సాగులో రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో నాడు బీఆర్ఎస్ సర్కార్ సిద్దిపేట జిల్లా నర్మెటలో మొదలుపెట్టిన పామాయిల్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రారంభతేదీని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మంగళవారం ప్రకటించారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో 20 నుంచి 22 వరకు రైతుమేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. పామాయిల్ రైతులకు భరోసా కల్పించేందుకు నాటి సీఎం కేసీఆర్ సిద్దిపేటలో ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగానే నాటి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 13న ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం పూర్తయ్యేలా చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ ఫ్యాక్టరీ నిర్మించడం గమనార్హం. రూ.300 కోట్లతో 62 ఎకరాల్లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. తొలుత గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుండగా, భవిష్యత్తులో దీనిని గంటకు 120 టన్నుల వరకు విస్తరించేలా రూపకల్పన చేశారు. నిరుడు సెప్టెంబర్లోనే ఫ్యాక్టరీ నిర్మాణంతోపాటు ట్రయల్న్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ పని చేస్తూనే ఉన్నది. ఎన్నికలు, ఇతరత్రా కారణాలతో ప్రభుత్వం కంపెనీ ప్రారంభాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.