వనపర్తి, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పాలమూరు నేలల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన పంటలు సిరులు కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. వనపర్తి జిల్లాలో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పామాయిల్ తోటలు నాటిన 17 నెలల్లోనే కాపు కొచ్చి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో 30 నెలలకు కాపు మొదలవుతుండగా.. జిల్లాలో అతి త్వరగా చేతికి వస్తుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం కంబాళాపూర్ శివారులో సాగు చేస్తున్న 50 ఎకరాల్లో నిర్ణీత సమయానికంటే ముందుగా గెలలు వేసింది. సాధారణంగా పామాయిల్ పంట మూడు నుంచి నాలుగేండ్లకు చేతికొస్తుంది. ఇక్కడ మాత్రం ఏడాదిన్నరలోపే కాపు కాయడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా పామాయిల్ తోటకు వెళ్లి పరిశీలించి, రైతులు ఆనంద్రెడ్డి, పుల్లారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, రాజవర్ధన్రెడ్డిని అభినందించారు.
20 లక్షల ఎకరాల సాగే లక్ష్యం
దేశ అవసరాల కోసం 80 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించాల్సి ఉన్నది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల ఎకరాల్లో పండించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, డిమాండ్కు సరిపడా మొక్కలు లేకపోవడంతో రైతులు ఆసక్తి కనబర్చినప్పటికీ సాగు పెరగడం లేదు. వనపర్తి జిల్లాలో 225 ఎకరాల్లో సాగు చేస్తుండగా మరో మూడేండ్లలో 12 వేల ఎకరాలకు మొక్కలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణలో పండే ఆయిల్పాం గెలల్లో అధికంగా నూనె వస్తుండటంతో పారిశ్రామికవేత్తలు ఇక్కడి పంటలపై దృష్టిసారిస్తున్నారు. పరిశోధనా సంస్థలు కూడా రాష్ట్రంలో పండే గెలల్లో నాణ్యత ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించాయి. సంప్రదాయ పంటలతో నష్టపోతున్న రైతులకు పామాయిల్తో పంట మార్పిడి చేసుకొనే సువర్ణ అవకాశమున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. పామాయిల్ సాగు చేసే రైతులకు ఉపాధిహామీ కింద గుంతల తవ్వకం, మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్ పరికరాలు, అవసరమైన రైతులకు రుణాలు ఇప్పించే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది. ఎస్టీ, ఎస్టీలకు వందశాతం, బీసీ, సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందిస్తున్నది. తోట నిర్వహణకు ఎకరాకు రూ.2 వేలు, అంతరపంట కోసం రూ.2 వేలు అందించనున్నారు. నాలుగేండ్ల్లపాటు ఏటా రూ.4 వేలు అందించనున్నారు.
పామాయిల్తో భారీ ప్రయోజనాలు: మంత్రి నిరంజన్రెడ్డి
పామాయిల్ సాగుతో భారీ ప్రయోజనాలున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పంటకు అధిక డిమాండ్ ఉన్నది. పామాయిల్ సాగులో తెలంగాణ అగ్రభాగాన నిలువబోతున్నది. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పామాయిల్ సాగు భారీగా పెరిగేలా వ్యవసాయశాఖ తరపున ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. తెలంగాణలో పండిన పామాయిల్ గెలల నుంచి ఎక్కువగా నూనె వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుమతి వస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే రైతులకు మేలు. పంట మార్పిడి విషయంలో ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తున్నాం. యఫ్జీవీ, పీయూ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సహకారంతో మొక్కలు పెంచి అందిస్తున్నాం. 17 నెలల సమయంలో గెలలు రావడం సంతోషకర పరిణామం. స్వయంగా వెళ్లి పంటను పరిశీలించాను. నేల స్వభావంతో తొందరగా దిగుబడి వస్తుంది. ఇది శుభసూచకం.