ఐదో విడతలో అనేక అభివృద్ధి పనులు
పారిశుద్ధ్యం మెరుగుదలకు పలు చర్యలు
మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులు నిర్వహించడంతోపాటు స్థానికంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి, పల్లె ప్రగతి ప్రణాళిక తయారు చేసుకొన్నారని, గ్రామాల్లోని రోడ్లు, మురుగునీటి కాలువలను శుభ్రం చేశారని చెప్పారు. రోడ్లకు ఇరువైపుల 10,844 కిలోమీటర్ల మేర అవెన్యు ప్లాంటేషన్ చేపట్టేందుకు అనువైన స్థలాన్ని గుర్తించామని, శ్రమదానంలో 6,39,822 మంది ప్రజలు పాల్గొన్నారని వివరించారు.
18,718 లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు నిలవకుండా పూడ్చివేత పనులు నిర్వహించామని, 23,150 ఇంకుడు గుంతలను, 4,239 సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించామని తెలిపారు. ఒక రోజు పవర్ హాలిడే కార్యక్రమంలో భాగంగా విద్యుత్తు శాఖ సిబ్బంది ప్రజల సమస్యలను పరిషరించడంతోపాటు 19,674 స్తంభాలకు లైన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 1,410 వైకుంఠధామాలకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడంతోపాటు 1,773 వైకుంఠధామాల్లో నీటి సౌకర్యం, మరో 1,010 వైకుంఠధామాల్లో ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి విజయవంతం కావడానికి కృషిచేసిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు.