హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాలే అంశాలుగా ప్రత్యేక తెలంగాణ కోసం గతంలో సీఎం కేసీఆర్ పోరాడారని రైతుబంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 80,089 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని, కాంట్రాక్టు పద్ధతి పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. విద్యావంతులైన నిరుద్యోగులకు తీపి కబురు అందించినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ప్రకటించిన ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లోనున్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వం గత ఏడున్నరేళ్లలో 1.52లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో 1.33లక్షల ఉద్యోగాలకు ఎంపిక పూర్తయ్యిందన్నారు.
మిగతా 19వేల ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ వివిధ స్థాయిలో ఉందని చెప్పారు. అలాగే ఉద్యోగాల ఎంపికలో అన్ని కేటగిరిల్లో పదేళ్లు గరిష్టంగా వయసు పెంచినందుకు రాజేశ్వర్రెడ్డి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగు, తాగునీరు అవసరాలను పూర్తి చేసి.. నిధులకు కొరత లేని రాష్ట్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర గణనీయమైందని, వాస్తవాన్ని గుర్తించి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తులు పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేసే ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రారంభించారన్నారు. స్థానికత ఆధారంగా అమలులోకి తీసుకొచ్చిన నూతన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు తప్పకుండా లభిస్తాయన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,089 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇతర రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా పారదర్శకంగా నిర్వహించబడుతుందని, అందువల్ల తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యావంతులు, విద్యార్థులు నిరంతరంగా శ్రమించి పోటీ పరీక్షలకు హాజరుకావాలన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.2శాతం ఉంటే.. తెలంగాణలో 2.2శాతంగా ఉందన్నారు. ప్రతి ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో, సంస్థల్లో దాదాపు 15లక్షల ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని, పాలన సాఫీగా జరగడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.