Palla Rajeshwar Reddy | గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ్యలంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ తాత ముధుసూదన్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ నేతలా విమర్శలకే పరిమితమయ్యారని, జిల్లా ప్రజలకు నిరాశ కల్పించారని విమర్శించారు. ప్రధాని.. బీజేపీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ను మాత్రమే చదివారని, ఎక్కువ చదువుకొని ఉంటే ఇలాంటి పరిస్థితే ఉండేదికాదని.. మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రధాని మోదీ అదానీ, అంబానీల కోసం తప్ప ప్రజల కోసం పనిచేయడంలేదని ఆరోపించారు. తెలంగాణలో గత 9సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 1.50 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వంలో 16లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి దేశవ్యాప్తంగా 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రైవేటు కంపెనీల ఆకర్షించడం ద్వారా ఇప్పటి వరకు 23వేల కంపెనీలు, సంస్థలు రూ.2.65 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని, వీటి ద్వారా 17.82లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.
ఐటీ రంగంలో తెలంగాణలో 9 లక్షలకుపైగా ఉద్యోగాలు చేస్తున్నారని, తెలంగాణ వచ్చే నాటికి వీరు 3లక్షలు కూడా లేరని, ప్రస్తుతం ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. మోదీ అసమర్థత, అచేతనతో ప్రతి రోజు 270 కంపెనీలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లెక్కలు తప్పయితే తాను ముక్కు నేలకు రాయడానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. వీటిపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జీఎస్డీపీ గణనీయంగా పెరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగలేదని కేంద్ర మంత్రే.. ప్రధాని సమక్షంలో పార్లమెంట్లో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. కొన్ని సంవత్సరాలుగా అవినీతిపై బీజేపీ నేతలు.. వాటిలో ఒక్కదాన్నైనా నిరూపించారా? అంటూ ప్రశ్నించారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, అక్కడి ప్రజలు బీజేపీని చిత్తుగా ఓడించారన్నారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి రూ.3.60లక్షల కోట్లు ఇస్తే కేంద్రం తెలంగాణకు రూ.1.60లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రమే ఇంకా రూ.2లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం చేసిన అప్పు ఎంత..? రాష్ట్రం చేసిన అప్పు ఎంత అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతుబంధు ద్వారా 70 వేల కోట్లకుపైగా రైతు ఖాతాల్లో నేరుగా చేశామని, కేంద్ర ప్రభుత్వ 13కోట్ల మంది రైతులకు డబ్బులు వేస్తామని చెప్పి.. 3కోట్లకు పరిమితం చేసిందని ధ్వజమెత్తారు. యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయకుండా బీజేపీ అనుబంధ విభాగాలు కోర్టుకు ఎక్కడంతో జారీ చేసిన రద్దయ్యిందని, తాజాగా రిక్రూట్మెంట్కు తీసుకవచ్చిన చట్టంపై గవర్నర్ సంతకం చేయడం లేదని ఆరోపించారు.