Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ నీళ్లియ్యనిదే తెలంగాణ పచ్చబడ్డదా?.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కావాలని కరాబ్ కట్టిండా? మనం ఇండ్లు కట్టుకుంటే గోడలకు పగుళ్లు రావా?.. గీయింతదానికే కాంగ్రెసోళ్లు గాయిగాయి చేస్తున్నరు.’ అంటూ పాలమూరు యువరైతు, సెలూన్ ఓనర్ శివ కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డాడు.
ఈ రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సాగునీటి ప్రాజెక్టులను నిరర్ధకమంటూ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాడు. నాగెళ్లి శివ (30) ఊరు జడ్చర్ల సెగ్మెంట్ మిడ్జిల్ మండలం కొత్తూరు. నాన్న కృష్ణయ్య, అమ్మ ప్రభావతిలది రెండెకరాల వ్యవసాయ భూమి గల బీద నాయీ బ్రాహ్మణ కుటుంబం. తలాపున అన్నట్టుగా కృష్ణమ్మ (కృష్ణానది) కనుచూపు మేరలో కనిపించినా చేలకు మలిపే నాథుడు లేడు.
హామీలే కానీ, అమలు చేయని అసమర్థ ప్రభుత్వాలు. వాటికవే తుమ్మ చెట్లు, పొదలు అల్లుకుపోయి ఆశల్ని చిదిమేసిన కాలం. పంటలు పండించుకోలేని దైన్యం. పిల్లలు, కుటుంబ పోషణకు కృష్ణయ్య బ్యాండ్ బృందంగా ప్రత్యామ్నాయం చూసుకోగా, ప్రభావతి కూలి పనుల్లో చెమటోడ్చేది. శివకుమార్ తన తమ్ముడు గణేశ్తో కలిసి పట్నం (హైదరాబాద్) బాట పట్టారు. సిటీలో సెలూన్ పనిలో కుదిరారు. ఎదుగూ బొదుగూ లేకుండా కుటుంబాన్ని భారంగా నెట్టుకొచ్చారు.
కేసీఆర్ పాలనలో మారిన బతుకు
స్వరాష్ట్రంలో పాత పాలమూరు జిల్లాలో కరువును తరిమేసేందుకుసీఎం కేసీఆర్ కంకణబద్ధులైన ఫలితం క్షేత్రంలో ఉనికిలోకి రావడం శుభపరిణామమైంది. కల్వకుర్తి ఎత్తిపోతల, ఇతరత్రా ఏర్పాట్లు నోరు తెరిచిన స్థానిక నీటి వనరులకు కొత్త కళ తేసాగాయి. కృష్ణా నదిలో అంతర్భాగమైన దుందుభి నదికి జీవ కళ వచ్చింది.
దుందుభి జలాలతో కొత్తూరు చెక్ డ్యాం, చెరువులకు కృష్ణమ్మ పరవళ్లు తీస్తున్నది. తద్వారా పిల్ల కాలువ మీదుగా కృష్ణయ్య పొలాన్ని కేసీఆర్ నీళ్లు ముద్దాడాయి. వరి సిరులు పండిస్తున్నారు. భూగర్భ జలాలకూ ఊపిరి రావడంతో ఒక ఎకరం కౌలుకు తీసుకొని, ఆ పొలంలోని బోరు నీటిని జోడించి మొత్తం మూడు ఎకరాలకు అనుసంధానం చేశారు. దీంతో నీటికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు.
సిటీలో తమ రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టుకొన్న శివకుమార్ ఓల్డ్ అల్వాల్ లో సొంతంగా శ్రీ గణేశ్ సెలూన్ పెట్టుకున్నాడు. మంగళవారాలు సహా ఏమాత్రం వీలు చిక్కినా తక్కిన రోజుల్లో శివకుమార్, గణేశ్ సోదరులు తమ ఊరికి వెళ్లి పొలం పనులు చేస్తుంటారు. అమ్మా నాన్నకు ఆసరా అవుతుంటారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ సర్కారు తీరును చూసి శివ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అసెంబ్లీ సమావేశాలు చూస్తూ సీఎం, మంత్రులపై మండిపడ్డాడు.
బాగా ఓవర్ చేస్తున్నరు!
‘కాంగ్రెసోళ్లు బాగా ఓవర్ చేస్తున్నరు. ఏదో అయిపోతున్నట్టు పబ్లిక్ను, ప్రజలను భయపెడుతున్నరు.’ అంటూ అసెంబ్లీ సమావేశాలను సెల్ఫోన్లో చూస్తూ శివకుమార్ అప్రయత్నంగా రియాక్ట్ అయ్యాడు.
‘కేసీఆర్ నీళ్లు ఇయ్యనిదే ఇంతగానం పొలాలు అయినయా? అంతంత వడ్లు పండినయా?
కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బోర్ల మీద దుమ్ము తప్ప ఏముండే? మనం ఇండ్లు కట్టుకుంటే పగుళ్లు రావా? కేసీఆర్ ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టును కరాబ్ కట్టుమంటడా? ఇపుడు వీళ్లు ఏమైనా కడితే లోపాలు ఉండయా? పదేండ్లళ్ల కొన్ని మిస్టేక్స్ ఉంటయి. వీళ్లు ఒక్క మిస్టేక్ లేకుండనే పాలన చేస్తరనేతందుకు గ్యారెంటీ ఏంది? ’ అని ప్రశ్నించాడు.
‘కేసీఆర్ అసెంబ్లీకి పోయేది ఉండే. అయినా రేపు నల్లగొండ మీటింగ్ల గట్టిగనే అర్సుకుంటడు గని. కాంగ్రెసోళ్లను గెలిపించిన నెలకే మన జుట్టు సెంట్రల్ (కేఆర్ఎంబీ) చేతుల పెట్టిన్రు’ అని వాపోయాడు. కేసీఆర్ను ఎట్ల దూరం చేసుకుంటిమి? అని అనిపిస్తున్నదని ఆవేదన చెందాడు. ఈ రెండు నెలల సంగతులన్నీ సభల తీస్తడు అంటూ శివ ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై ఇలా ప్రతిస్పందించాడు.
-ఇల్లెందుల దుర్గాప్రసాద్ (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)