Yashaswini Reddy | హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ)/దేవరుప్పుల: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో కలహాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గ కార్యకర్తలు హైదరాబాద్ గాంధీభవన్కు శనివారం పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చారు. కార్యాలయ ఆవరణలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు నేతలు ధ్వజమెత్తారు. దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని తొలగించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నామమాత్రం అయ్యారని, ఇటు పార్టీలో, అటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ యశస్వినీరెడ్డి అత్తగారైన ఝాన్సీరెడ్డే పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డి డౌన్డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్కు వారు వినతిపత్రం అందజేశారు. సమస్యను సీఎంకు వివరించి పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.