హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందాలనుకొనేవారికి అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఏవై) రుణాల్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరిగింది. బీజేపీ పాలిత సహా పలు ఇతర రాష్ర్టాలకు 40-50 శాతం రుణాలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం 12 శాతంతో సరిపెట్టింది. జాతీయ సగటుతో పోల్చితే సగం మందికే రుణాలు మంజూరు చేసింది. అదీకాక.. గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు మంజూరు చేయాల్సిఉన్నా లక్ష- 2 లక్షలకు మించి ఎవ్వరికీ ఇవ్వలేదు. వ్యాపారులు, నిరుద్యోగులు రోజూ వేల సంఖ్యలో రుణాలకోసం బ్యాంకులకు వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోనే దాదాపు నాలుగు లక్షలకుపైగా ముద్ర పథకానికి అర్హులని తేలింది. కరోనా కారణంగా వ్యాపారాలు నడవక, ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకోవాల్సిన ఈ పథకం, తెలంగాణలో మాత్రం ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముద్ర రుణాల మంజూరులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రధాని మోదీకి తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు లేఖ రాశారు. రుణాల మంజూరులో జాతీయ సగటు 21.57 శాతం ఉండగా, తెలంగాణలో 12.27 శాతం మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 35.8 లక్షల మంది అర్హులకు రుణాలు మంజూరు కావాల్సి ఉన్నదని చెప్పారు. గతంలోనూ దీనిపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేదని గుర్తుచేశారు. ఐటీఐఆర్ సహా ఇతర అంశాల్లో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని లేఖలో విన్నవించారు.
పాండిచ్చేరి-55.87, తమిళనాడు- 45.56, త్రిపుర- 45.24, కర్ణాటక- 43.14, ఒడిశా-43.00, పశ్చిమబెంగాల్- 29.76, కేరళ- 27.98, అస్సాం-24.37, బీహార్-22.87, మధ్యప్రదేశ్-21.30, ఛత్తీస్గఢ్-20.30, జార్ఖండ్-20.56, హర్యానా- 19.47, పంజాబ్- 19.04, మహారాష్ట్ర- 18.99, ఉత్తరాఖండ్- 16.07, సిక్కిం- 15.97, రాజస్థాన్-15.20, గోవా- 14.97, గుజరాత్- 14.16, ఢిల్లీ- 13.35, తెలంగాణ- 12.27.