హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను సైతం ప్రైవేటు బాట పట్టిస్తుండగా, కొన్నేండ్లుగా నష్టాలతో ఈడ్చుకొస్తున్న టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో టీఎస్ఆర్టీసీ నష్టాలను పూడ్చుకొని లాభాలు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నది. దాదాపు రూ.2,500 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ వాటి నుంచి బయటపడేందుకు 100 రోజుల ప్రణాళికను అమలుచేసి సానుకూల ఫలితాలను సాధిస్తున్నది. ఖర్చులు కొంతవరకు తగ్గించుకొని, ఇంధనం ధరల భారాన్ని దించుకొనేందుకు డీజిల్ సెస్ వసూలు చేస్తున్నది. దీంతో సంస్థ రోజువారీ ఆదాయం సుమారు రూ. 2 కోట్ల వరకు పెరిగింది.
గతంలో ప్రతి నెల రూ.100 కోట్ల వరకు నష్టాలు వచ్చేవి. ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే డిపోలు లాభాలబా ట పట్టాయి. ఏప్రిల్ నెలలో 4, మే నెలలో 8 డిపో లు లాభాలు సాధించాయి. జూన్లో లాభాల్లోకి వచ్చిన డిపోల సంఖ్య 19కి పెరిగింది. ఆయా డిపో ల నుంచి రూ.7.42 కోట్లు ఆదాయం సమకూరిం ది. భారీ వర్షాలు, వరుస సెలవులతో జూలై నెలలో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ నాలుగు డిపోలు లాభాలు సాధించాయి. ఆగస్టు నెలలో రాఖీ పండుగ రోజున సం స్థకు రూ.20 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే తరహాలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరిన్ని డిపోలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
8 రాష్ర్టాల్లో అధ్యయనం.. మూడు దశల్లో సంస్కరణల అమలు..
టీఎస్ఆర్టీసీ అధికారులు ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా రో తెలుసుకొనేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఐదుగురు అధికారుల బృందం జూలై 20, 21 తేదీల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి వచ్చింది. ఈ నెలలో మరో బృందం తమిళనాడు, రాజస్థాన్, కేరళ రాష్ర్టా ల్లో పర్యటించనుంది. అధికారుల బృందం నివేదిక ఇవ్వగానే ఆయా రాష్ర్టాల్లో ఉత్తమ విధానాలను గుర్తించి వాటిని ఇక్కడ అమలు చేయనున్నారు.
ఇతర మార్గాల ఆదాయంపై దృష్టి
బస్సుల ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై టీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ఆర్టీసీ కార్గో విజయవంతమైంది. ఆర్టీసీ దవాఖాన, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీలు సైతం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయి. ఇవి కాకుండా త్వరలో ఆర్టీసీ సంస్థ జీవ (ziva) అనే బ్రాండ్తో వాటర్ బాటిళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయ్యింది. ఇవే కాకుండా పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సైతం సిద్ధమవుతున్నది. అలాగే రాష్ట్రంలో సంస్థకు ఉన్న ఖాళీ స్థలాలను సైతం ఆదాయ వనరులుగా మార్చుకోనున్నది. ఈ మేరకు దాదాపు 30కిపైగా స్థలాలలో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే వివిధ సంస్థలతో ఒప్పందాలు సైతం చేసుకుంది.
ఎట్టిపరిస్థితుల్లో టికెట్ ధరలు పెంచం
ఆర్టీసీ సంస్థ దాదాపు రూ. 2500 కోట్ల నష్టాల్లో ఉంది. ఏడాది కాలంలో వీటన్నింటి నుంచి బయటపడి, సంస్థను ఓ కోటి రూపాయల లాభంలో ఉంచాలనేది మా లక్ష్యం. చాలా పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం, కానీ దాన్ని సాధించేందుకు అంతే కష్టపడుతున్నాం. సంస్థను కాపాడుకుంటూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే డీజిల్సెస్ పెంచాం. టికెట్ ధరలు పెంచకుండానే వేరే మార్గాల్లో సంస్థను లాభాల్లోకి తీసుకొస్తాం.
– సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ
జూలైలో నాలుగు డిపోల లాభాలు (రూ.లక్షలో)
రంగారెడ్డి (హైదరాబాద్-1) : 81.12
పికెట్ : 57.75
రంగారెడ్డి (హైదరాబాద్-2) : 17.21
నల్లగొండ (మిర్యాలగూడ) : 6.58