హైదరాబాద్: దేశంలో థర్డ్ ఫ్రంట్కు బలమైన అవకాశాలు ఉన్నాయని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మూడో ఫ్రంట్కు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు. కేసీఆర్, మాయావతి వంటి నేతలు అటు ఎన్డీయే గానీ, ఇటు ఇండియా కూటమిలో గానీ లేరని, ప్రాంతీయంగా గట్టి పట్టున్న పార్టీలు రెండు కూటముల్లోనూ లేవన్నారు. ఈ నేపథ్యంలో మూడో కూటమికి కేసీఆర్ చొరవ తీసుకొంటారని ఆశిస్తున్నానని ఆదివారం ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఒవైసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలపై ఒవైసీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెబుతున్న కాంగ్రెస్.. ముస్లింల విషయంలో ఏం చెబుతుందని సూటిగా ప్రశ్నించారు. మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
కర్ణాటకకు, తెలంగాణలోని పరిస్థితులకు తేడాలను ఒవైసీ స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, అదే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు దారుణంగా ఉండేవని, ఆర్థిక వ్యవస్థ గందరగోళమైందని విమర్శించారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదని, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నదని పేర్కొన్నారు. ‘తెలంగాణలో హిజాబ్ ధరించే ముస్లిం బాలికలకు ఎటువంటి ముప్పు లేదు. ధైర్యంగా కాలేజీలకు వెళ్లగలుగుతున్నారు. రాష్ట్రంలో ముస్లింలపై దాడులు జరుగడం లేదు’ అని ఒవైసీ అన్నారు. ‘ఇది తెలంగాణ.. కర్ణాటక కాదు’ అంటూ రెండు రాష్ర్టాల మధ్య ఉన్న తేడాను ఒక్కమాటలో ఒవైసీ తేల్చేశారు.