సూర్యాపేట, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ పథకాలను దేశ ప్రజానీకం కోరుకొంటున్నదని తెలిపారు. దేశానికి సీఎం కేసీఆర్ దిక్సూచిలా మారాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం నుంచి గత ఎనిమిదేండ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు పోతే, తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. ‘ఈ లెక్క తప్పని నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నేను చెప్పింది నిజమని తేలితే కేంద్ర మంత్రి పదవిని ఎలాగూ వదులుకోవటానికి సిద్ధంగాలేని కిషన్రెడ్డికి, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పే సంస్కారం ఉన్నదా?’ అని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించారు.
హుజూర్నగర్లో ఈఎస్ఐ దవాఖాన, ట్రెజరీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.76.30 కోట్లతో చేపట్టనున్న పనులకు శంఖస్థాపన చేశారు. అనంతరం హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రసంగించారు. తెలంగాణకు బాకీ పడిన రూ.2 లక్షల కోట్లను వెనుకబడిన బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్లో ఖర్చుచేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను అమలు చేయలేని దద్దమ్మ కేంద్రం, తెలంగాణపై కుట్రలు చేస్తున్నదని దుయ్యబట్టారు. కిషన్రెడ్డితోపాటు ఒకరిద్దరు ఎంపీలు విషయ పరిజ్ఞానం లేకుండా వాగుతున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు. ఇవాళ రూ.2.78 లక్షలకు చేరింది. మరి దేశ తలసరి ఆదాయం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో రూ.1.49 లక్షలు మాత్రమే ఎందుకు ఉన్నది? దీనిబట్టే ఎవరు సమర్థుడో, ఎవరు అసమర్థుడో తేలిపోతున్నది’ అని చెప్పారు.
తెలంగాణ దేశానికే ఆదర్శం
28 రాష్ర్టాల్లో ఏనాడూ ఏ సీఎం, ఏ ప్రధాని చేయని గొప్ప ఆలోచనలతో సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలుచేసి చూపారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.65 వేల కోట్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్కు వచ్చిన ఆలోచన ఏ సీఎంకు, ప్రధానికి రాలేదు. పెద్దపెద్ద మాటలు చెప్పినోళ్లు ఏనాడూ కేసీఆర్ మాదిరిగా 24 గంటల ఉచిత కరెంటు, రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ఆలోచించలేదు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ ఏం చేశారో తెలుసా? 12 లక్షల మంది పేద పిల్లలకు పెండ్లిళ్లకు ఆర్థికసాయం చేశారు. 11 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, ప్రతి పల్లెలో ట్యాంకర్, ట్రాక్టర్, డంప్యార్డు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు తెచ్చారు’ అని తెలిపారు. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలోనే అనేలా గ్రామీణాభివృద్ధి జరిగిందని చెప్పారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో మూడున్నరేండ్లలోనే రూ.3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఎత్తిపోతల కోసం రూ.2 వేల కోట్లు వెచ్చించాం. హుజూర్నగర్కు రూ. 25 కోట్లు, నేరేడుచర్లకు రూ.15 కోట్లు, ఒక్కో మండలానికి రూ.30 లక్షలు, ఒక్కో గ్రామానికి రూ.20 లక్షల చొప్పున రూ.26.80 కోట్లు ఇచ్చింది నిజం కాదా? మూసీపై ఏడు చెక్డ్యామ్లకు రూ.27 కోట్లు, పాలకవీడు, చింతలపాలెం కేజీబీవీ భవనాలకు రూ.7 కోట్లు, హుజూర్నగర్ మున్సిపాలిటీలో మినీ ట్యాంక్ కోసం రూ.8.40 లక్షలు, ప్రత్యేక ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.6.30 కోట్లు కలిపి రూ.123 కోట్లు ఇచ్చింది నిజం కాదా? గిరిజనుల కోసం తండాలను గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా రూ.3.50 కోట్లతో బంజారా భవన్ను నిర్మిస్తున్నాం. గ్రామపంచాయతీలుగా మారిన తండాల్లో రూ.35 కోట్లతో రోడ్లు, పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నాం. హుజూర్నగర్లో రూ.60 కోట్లతో పేదలకు 2,160 ఇండ్లు కట్టించి ఇస్తున్నాం. ఎమ్మెల్యే సైదిరెడ్డి మరో రూ.35 కోట్లు అడిగారు. తక్షణమే ఆ నిధులు మంజూరు చేయిస్తా’ అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జాన్పహాడ్ దర్గాను జహంగీర్ పీర్ దర్గాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. చండూరు, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో దాదాపు రూ.50 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గట్టుప్పల్, తేరట్పల్లి చేనేత కార్మికుల కోసం చేనేత క్లస్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీని వల్ల గట్టుప్పల్లో 460 మంది, తేరట్పల్లిలో 190 మందికి మేలు జరుగనున్నది. వట్టిపల్లి గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ బాధితురాలు తిరుతమ్మ ఇంటి నిర్మాణానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5.4 లక్షల చెక్కును అందజేశారు.
ఫ్లోరోసిస్ బాధితురాలు పానుగంటి తిరుపతమ్మకు రూ.5.04 లక్షల డబుల్బెడ్రూం చెక్కును అందజేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రి జగదీశ్రెడ్డి తదితరులు
కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్న దేశం: మంత్రి జగదీశ్రెడ్డి
నేడు యావత్ దేశం తెలంగాణ మాడల్ను కోరుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కేసీఆర్ను ఆంధ్రలోనే కాదు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఇష్టపడుతున్నారని తెలిపారు. అందుకే ఏపీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ‘ఇవాళ ఆంధ్రా ప్రజలు మన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి సంతోషపడుతున్నారు. గతంలో 28 రాష్ర్టాల ప్రజలు వచ్చి రాష్ర్టాన్ని చూసి పోయారు. అగ్రరాజ్యాల్లో సైతం వీలు కాని పనులను సైతం పూర్తి చేసింది కేసీఆర్ ఒక్కరే. కేసీఆర్ చేస్తున్న మంచిపనులను చూసి దెయ్యం లాంటి నరేంద్రమోదీ సహించలేక ఈర్ష్య పడుతున్నారు. ఇవాళ గుజరాత్లో ఏ ఇంటి ముందు ముగ్గురు పెద్ద మనుషులు కూర్చున్నా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు’ అని పేర్కొన్నారు.
అభివృద్ధికోసం తెలంగాణ అప్పులు.. దోస్తుల కోసం మోదీ అప్పులు
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి పైసా అప్పు మరింత సంపదను సృష్టించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశారని ఒక నేత తరచూ అంటున్నారు. తెలంగాణలో చేసిన అప్పులతో ఉత్పాదన జరిగి జీఎస్డీపీ గణనీయంగా పెరుగుతుంటే, మరో పక్క కేంద్రంలో ప్రధాని మోదీ మాత్రం ఆయన స్నేహితుల కోసం అప్పులు తెచ్చి ప్రపంచ కుబేరులుగా మారుస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశ అప్పు రూ.56 లక్షల కోట్లు ఉంటే, మోదీ హయాంలో ఏకంగా రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు మోపారు.
నాడు జన్ధన్ అక్కౌంట్లు తెరిస్తే, ధనాధన్ పంద్రా లాఖ్ వస్తాయని ప్రజల చెవిలో పువ్వు పెట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్నడు. ఎక్కడ పోయినయ్? ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉంటే, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసేందుకు మోదీ ప్రభుత్వం సర్కారీ సంస్థల ప్రైవేటీకరణకు తెరలేపింది ఎస్సీ, ఎస్టీకు రిజర్వేషన్లను దూరం చేస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా ఉండే పథకాలను తెచ్చింది. దామరచర్లలో 5 వేల మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టు కడుతున్నది. ఇది భవిష్యత్తుపై పెట్టుబడి. మిషన్ భగీరథ కోసం రూ.45 వేల కోట్లు తెచ్చి నల్లగొండలో ఫ్లోరోసిస్ను రూపు మాపింది కేసీఆర్. రూ.2 వేల కోట్లతో ఎత్తిపోతల నిర్మాణం జరుగుతున్నది. మోదీ తెచ్చిన రూ.100 లక్షల కోట్ల అప్పులతో ఒక్క మంచి పని అయినా చేశారా? కేవలం ఆయన దోస్తులను కుబేరులను చేయడం తప్ప ఈ దేశంలో బీజేపీ పాలనలో బాగుపడ్డ ఒక్క దళితుడు, గిరిజనుడు, బలహీనవర్గ సోదరుడు ఉన్నాడా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.