హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద మొదలైంది. కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1,06,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 1,06,772 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్ సామర్థ్యం 6.657 టీఎంసీలు కాగా, 6.896 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
జూరాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నది. జూరాల, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వస్తున్నది. దీంతో పది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది.