Health budget | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రజావైద్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో గణనీయంగా కేటాయింపులు పెంచింది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగయ్యాయి. ప్రజలకు ఉత్తమ వైద్యం అందుతున్నది. 2014లో తలసరి హెల్త్ బడ్జెట్ రూ.925 ఉండగా, వైద్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కారణంగా 2023 నాటికి రూ.3,532కు పెరిగింది. అంటే 2014తో పోల్చితే తలసరి కేటాయింపులు 2023-24 నాటికి సుమారు నాలుగింతలు పెరిగాయి. ఇది దేశంలోని పెద్ద రాష్ర్టాల్లోనే అత్యధికం కావడం విశేషం. తొమ్మిదేండ్లలో రూ.2,607 పెరుగుదల నమోదయ్యింది. కేటాయింపులు పెరుగడంతో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, టీ డయాగ్నొస్టిక్స్వంటి దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను అమలు చేసేందుకు అవకాశం కలిగింది.
మరోవైపు దవాఖానల్లో వసతులు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు 2014 నాటికి రాష్ట్రంలో కేవలం 1400 ఆక్సిజన్ పడకలు ఉంటే 2023 నాటికి ఏకంగా ఆ సంఖ్య 34 వేలకు చేరింది. డయాలసిస్ కేంద్రాలు కేవలం 3 ఉండగా 102కు పెరిగాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ లక్ష్యమైన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు సైతం తుది దశకు చేరింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువవుతున్నాయి. వైద్యసేవలు మెరుగుపడడంతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఓపీ, ఐపీ, సర్జరీలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ సేవలు పెరిగాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 62 శాతానికి రెట్టింపు కాగా, మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి.