ఖైరతాబాద్, డిసెంబర్ 19: ఎన్టీఆర్ స్టేడియం (కళాభారతి) వేదికగా ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ చెప్పారు. 11 రోజులు జరిగే పుస్తక ప్రదర్శనలో 340 స్టాల్స్, రచయితలకు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్లా ప్రతిఏటా అతి పెద్ద ఈవెంట్గా ఈ పుస్తక పండుగ నిలుస్తున్నదని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు బుక్ ఫెయిర్కు 11 రోజుల్లో పది లక్షల మంది హాజరుకావడం ఒక రికార్డు అని తెలిపారు. ఈ ప్రదర్శనకు 33 జిల్లాలతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి అన్ని పబ్లికేషన్ల వారు వస్తున్నారని చెప్పారు. రాబోయే తరాలకు ఒక మార్గదర్శిలా బుక్ ఫెయిర్ నిలుస్తున్నదని చెప్పారు. నేడు సోషల్, డిజిటల్ మీడియా వచ్చినా రాష్ట్రంలో అక్షరాస్యతతోపాటు పుస్తకాల చదివే వారి సంఖ్య కూడా బాగా పెరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సహకరిస్తున్నాయని, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ పుస్తకాలకు ప్రత్యేక స్టాల్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై వచ్చిన పుస్తకాల కోసం ప్రత్యేకంగా ‘మన ముఖ్యమంత్రి స్టాల్’ను ఏర్పాటుచేస్తున్నట్టు జూలూరు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల ఆధ్వర్యంలోనూ స్టాళ్లు ఉంటాయని తెలిపారు. సాహిత్య కార్యక్రమాలను సైతం ప్రతి ఏడాది విన్నూతంగా నిర్వహిస్తున్నామని, ఈ సారి కూడా స్త్రీవాదం, దళిత, బహుజన, మైనార్టీ, గిరిజన, ఆదివాసీ, డోలు, తుడుందెబ్బ సాహిత్య ప్రదర్శన ఉంటుందని చెప్పారు. రామాయణం, భారతం తదితర అన్ని వాదాల సాహిత్యంపై కార్యక్రమాలను ప్రతి రోజు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పిల్లల్లో పుస్తకాలు చదువాలన్న ఆసక్తి పెరిగిందని, తాను స్వయంగా అన్ని స్కూళ్లలో కథల పోటీలు నిర్వహిస్తే ఐదు లక్షల మంది రాశారని గుర్తు చేశారు.
పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతోపాటు అన్ని దినపత్రికల ఎడిటర్లు హాజరవుతున్నారని జూలూరు తెలిపారు. గతంలో మాదిరిగానే జర్నలిస్టులు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ చెప్పారు. సమావేశంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, కార్యదర్శి స్మృతికాంత్ భారతి, సహాయ కార్యదర్శి రాజేశ్వర్రావు, కార్యవర్గ సభ్యులు వాసు తదితరులు పాల్గొన్నారు.