జనగామ చౌరస్తా, జూలై 7: టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీసీ వ్యతిరేకి అని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కంచ రాములు విమర్శించారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో కాంగ్రెస్ బీసీ నాయకులు మీడియా స మావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కంచ రాములు హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వదని భావించిన పొన్నాల.. ఇటీవల నియోజకవర్గం బీసీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. బీసీలపై ఇంతకాలం లేని ప్రేమ.. పొ న్నాలకు ఇప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గ బీసీ నాయకులు దీని ని అర్థం చేసుకోవాలని సూ చించారు. పొన్నాల రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన, ఆయనను భుజాలపై మోసిన బీసీ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం కార్పొరేషన్ పదవులు కూడా ఇప్పించలేని అసమర్థుడని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠా నం జనగామలో పొన్నాలకు టికెట్ ఇవ్వకుండా మరో బీసీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2014లో మున్సిపల్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి ఒక్కో కాంగ్రెస్ కౌన్సిలర్ నుంచి రూ.20 లక్షల చొప్పున పొన్నాల కోడలు, బావమరిది డబ్బులు వసూలు చేశారని, నాలుగేండ్లయినా ఆ డబ్బులు తిరిగి కౌన్సిలర్లకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. జనగామలో పొన్నాల మళ్లీ పోటీ చేస్తే బీసీలంతా మూకుమ్మడిగా ఓడిస్తామని రాములు హెచ్చరించారు.